చెన్నై సమీపంలో ఓ కారులో రూ. 5 కోట్లు పట్టుబడ్డ సంగతి తెలిసిందే. ఆ కారుపై ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ స్టిక్కర్ ఉండటంతో ఇది వైసీపీ అక్రమ సంపాదన అని, పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారని విమర్శలు వెల్లువిరుస్తున్నాయి. ఈ వ్యవహారం పై ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని స్పందించారు. ఈ కారుకు పార్టీకి సంబంధం లేదన్నారు. ఆ వాహనం తమిళనాడులో రిజిస్టర్ అయిందన్నారు. విచారణలో అన్ని విషయాలు బయటపడుతాయని తెలిపారు.
తనకు తెలిసినంత వరకూ కారుపై ఉన్న స్టిక్కర్ ఒరిజినల్ కాదని, జిరాక్స్ కాపీ అని వ్యాఖ్యానించారు. స్టిక్కర్ ఫోటోస్టాట్ కాపీ అని, దీన్ని మీడియా వారు పరిశీలిస్తే, వారే గుర్తించగలరని అన్నారు. ఈ డబ్బు తనకు సంబంధించినది మాత్రం కాదని అన్నారు. ఈ ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నానని పేర్కొన్నారు.