అప్ఘనిస్తాన్లో తాలిబన్లు కొత్త ప్రభుత్వం కొలువుదీరుతునట్టు వార్తలు వస్తున్నాయి. మహిళలను గౌరవిస్తామని ఇప్పటికే తాలిబన్లు అనేకమార్లు ప్రకటించారు. వాళ్లు చెబుతున్న మాటలకు, చేతలకు ఏ మాత్రం పొంతనలేదని మరోమారు స్పష్టమైంది. రెండు దశాబ్దాల కాలం నాటి తాలిబన్ల అరాచక పాలనను గుర్తుకు తెచ్చుకుంటున్న అక్కడి మహిళలు తమ హక్కుల కోసం రోడ్డెక్కుతున్నారు. అఫ్ఘనిస్తాన్లోని హెరాత్లో నిన్న 50 మంది మహిళలు రోడ్డుపైకి వచ్చి నినాదాలు చేసిన సంగతి తెలిసిందే. మహిళలకు ప్రభుత్వంలో అవకాశం కల్పించాలని నినాదాలు చేశారు.
రోడ్డుపైకి వచ్చిన నిరసలు చేస్తున్న మహిళల దగ్గరనుంచి తాలిబన్లు ప్లకార్డులు లాక్కుని, వారిపై దౌర్జన్యానికి దిగారు. పాశ్చాత్య దేశాల ప్రోత్సాహంతో తమకు లభించిన స్వేచ్ఛ, హక్కులను కాలరాయొద్దంటూ కాబూల్లోని ప్రెసిడెన్షియల్ భవనం వద్ద మహిళలు ఆందోళనకు దిగారు. మహిళలతో కూడిన కేబినెట్ ఏర్పాటు చేయాలంటూ తాలిబన్లను కోరుతున్నారు. మానవ హక్కుల ప్రాధాన్యతను నొక్కి చెప్తూ మళ్లీ గత పాలనలోకి తాము వెళ్లాలనుకోవడం లేదని నినాదాలు చేస్తున్నారు. దేశ భవిష్యత్తులో మహిళలకు
విద్య, సామాజిక, రాజకీయాలతో పాటు స్వేచ్ఛగా మాట్లాడే హక్కులను కల్పించాలని డిమాండ్ చేస్తూ కరపత్రాలను పంచారు.
అప్ఘన్లోని అనేక ప్రాంతాల్లో పలు దుకాణాల్లో ప్రచార బోర్డులపై ఉన్న మహిళా మోడల్ చిత్రాలను తొలగించేందుకు ఒత్తిడి తీసుకురావడంతో బ్యూటీపార్లర్ షాపుల యజమానులు మహిళల ప్రచార చిత్రాలపై రంగులు వేసి తొలగించారు. దీనికి సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దీనిపై అప్ఘన్లో మహిళలకు పూర్తిగా హక్కులు లేవంటూ నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.