ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో హిందీ, తెలుగు, తమిళం… ఇలా భాషలతో సంబంధం లేకుండా ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులకి సంబంధించి ఇప్పటికే పలు బయోపిక్ చిత్రాలు రూపొందాయి. తాజాగా ప్రపంచ మహిళా క్రికెట్లోనే అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ మిథాలీ రాజ్ జీవిత నేపథ్యంలో చిత్రం రూపొందుతుంది. సుదీర్ఘకాలం ఇండియాకు ప్రాతినిథ్యం వహించిన మిథాలీ ఇటీవల టీ 20లకి గుడ్ బై చెప్పింది. 2018లో ఆమె జట్టు తరఫున కీలకంగా వ్యవహరించారు.ఇప్పుడు ఆమె జీవితాన్ని వెండితెరపైకి తీసుకొచ్చేందుకు వయాకామ్ 18 సంస్థ సన్నాహాలు చేస్తుంది. మిథాలీ పాత్రలో ఏ నటిని ఎంపిక చేయాలనే దానిపై నిర్మాణ సంస్థ కొన్నాళ్ళుగా చర్చలు జరుపుతుంది. విభిన్న పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులని అలరిస్తున్న తాప్సీ.. మిథాలీ పాత్రకి సరిగ్గా సరిపోతుందనే ఆలోచన వయాకామ్ 18 సంస్థ చేస్తున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. అనుకున్నట్టుగానే మిథాలీ పాత్రని తాప్సీ పోషిస్తున్నట్టు అఫీషియల్గా ప్రకటించారు మేకర్స్. రాయీస్ ఫేమ్ రాహుల్ దొలాకియా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. “శభాష్ మిథు” పేరుతో చిత్రం విడుదల కానుంది. అతి త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ను సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నారు. తాప్సీ చివరిగా “శాండ్ కీ ఆంఖ్” అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో 70 ఏళ్ళ వయస్సున్న వృద్దురాలిగా కనిపించి అలరించింది.
previous post