మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో సురేందర్రెడ్డి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం “సైరా నరసింహారెడ్డి”. అమితాబ్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, అనుష్క, తమన్నా, నయనతారలాంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 2న విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించి జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్లు, ట్రైలర్ సామాన్యులతోపాటు సినీ ప్రముఖులను సైతం ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఉయ్యలవాడ నర్సింహారెడ్డి పాత్రలో కనిపించాలని మెగాస్టార్ చిరంజీవి ఎప్పట్నుంచో అనుకుంటున్నారు. ఎట్టకేలకు అది కార్యరూపం దాల్చింది. అయితే గత కొద్ది రోజులుగా చిత్రంకి సంబంధించి అనేక వివాదాలు చెలరేగుతూ వస్తున్నాయి. అయితే అన్నింటిని చక్కదిద్ది రేపు మూవీని రిలీజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు దర్శకనిర్మాతలు. ఇంతలోనే సినిమాను విడుదల కాకుండా అడ్డుకుంటామంటూ ఒడిశాలోని కళింగసేన పార్టీ హెచ్చరించింది. తెల్లదొరలకి వ్యతిరేఖంగా తొలి విప్లవం తెచ్చింది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. 1846లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో తొలి విప్లవం జరిగిందని చెబుతూ సినిమాను తెరకెక్కించారు సైరా మేకర్స్. అయితే 200 ఏళ్ల కిందటే అంటే 1817లో ఒడిశాలో తొలి స్వాతంత్య్ర పోరాటం జరిగిందని వాదిస్తోంది కళింగ సేన. చిత్ర దర్శకుడు తప్పుగా చిత్రీకరించి ఒడిశా ప్రతిష్టకి భంగం కలిగిస్తున్నారు. ఖుర్ధా ప్రాంతం ప్రజలు పయికొ విప్లవం పేరిట తొలి పోరాటం చేశారు. 2017లో మన రాష్ట్రపతి పయికొ విప్లవంది తొలి విప్లవంగా ప్రకటించారు. కాని సైరా దర్శకుడు తప్పుగా చెప్పడం మమ్మల్ని కించపరిచినట్టుగా ఉంది. ఒడిశాలో సినిమా రిలీజ్ని తప్పక అడ్డుకుంటాం అని కళింగ సేన కార్యదర్శి అంటున్నారు. భువనేశ్వర్లో ‘సైరా’ సినిమాను ప్రదర్శించనున్న శ్రీయ థియేటర్ వద్ద కళింగసేన పార్టీ సోమవారం నిరసన తెలిపింది. ఆందోళనకారులు అమితాబ్బచ్చన్, చిరంజీవి దిష్టిబొమ్మలు దహనం చేసి, పోస్టర్లకు నిప్పంటించారు. మరి దీనిపై చిత్ర యూనిట్ స్పందిస్తుందా లేదా అనేది చూడాలి.
previous post