telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రియా చక్రవర్తిపై పోలీసులకు సుశాంత్ తండ్రి ఫిర్యాదు… కేసు నమోదు

Sushanth

దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తిపై ఆయన కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రియా చక్రవర్తిపై సుశాంత్ కుటుంబం బహిరంగంగా ఆరోపణలు చేయడం ఇదే తొలిసారి. ప్రస్తుతం సుశాంత్ ఆత్మహత్య కేసును ముంబై పోలీసులు విచారిస్తోన్న సంగతి తెలిసిందే. ఆర్థికంగా సుశాంత్‌ను రియా వాడుకుందని, మానసిక క్షోభకు గురిచేసిందని ఆరోపిస్తూ పాట్నా పోలీసులకు సుశాంత్ తండ్రి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పాట్నా పోలీసులు రియా చక్రవర్తిపై కేసు నమోదు చేశారు. సుశాంత్ తండ్రి ఫిర్యాదు మేరకు ఆత్మహత్యకు ప్రేరేపించడం సహా పలు సెక్షన్ల కింద రియా చక్రవర్తిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టు పాట్నా సెంట్రల్ జోన్ ఇన్‌స్పెక్టర్ జనరల్ సంజయ్ సింగ్ వెల్లడించారు. ఇక సుశాంత్ మృతిపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తోన్న బాలీవుడ్ నటుడు శేఖర్ సుమన్ సైతం రియాపై కేసు నమోదుచేసినట్టు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘‘సెక్షన్ 306 (ఆత్మహత్యకు ప్రేరేపించడం)తోపాటు సెక్షన్ 340, 342ల కింద రియా, ఆమె కుటుంబంపై కేసు నమోదైంది. సుశాంత్ కుటుంబం ఫిర్యాదు చేయగానే పాట్నా నుంచి పోలీసులు ముంబై చేరుకున్నారు. ఈ కేసును దర్యాప్తు చేయడానికి సిట్‌ను ఏర్పాటు చేశారు’’ అని శేఖర్ సుమన్ వరుస ట్వీట్‌లు చేశారు. ఇదిలా ఉంటే, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని రెండు వారాల క్రితం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను రియా చక్రవర్తి కోరారు. జూన్ 14న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ముంబైలోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సుశాంత్ ఆత్మహత్యపై సమగ్ర విచారణ చేపట్టాలని మహారాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖను ఆదేశించింది. దీంతో ఇప్పటి వరకు 40 మందిని ముంబై పోలీసులు విచారించారు.

Related posts