బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసు రోజురోజుకూ కీలక మలుపులు తిరుగుతోంది. సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని ముంబై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. మరోవైపు సీబీఐ ఇన్వెస్టిగేషన్లో రియాను నిందితురాలుగా చేర్చి విచారణ జరుపుతున్నారు. అయితే రియా బెయిల్ కోసం కోర్టులో దరఖాస్తు చేసుకుంది. కానీ కోర్టు రియాకు బెయిల్ నిరాకరించి 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ విధించింది. అయితే ఈ కేసును దర్యాప్తు చేస్తున్న నార్కోటిక్స్ దర్యాప్తు బృందంలోని అధికారి కరోనా బారిన పడడంతో విచారణను మధ్యలోనే నిలిపివేశారు. నిబంధనల ప్రకారం మిగతా సభ్యులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించిన అనంతరం తిరిగి విచారణను ప్రారంభించనున్నట్టు ఎన్సీబీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. సుశాంత్ మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి వాట్సాప్ సంభాషణల్లో శ్రుతి మోదీ, టాలెంట్ మేనేజర్ జయ సాహ పేర్లు కూడా ఉండడంతో వారిని ప్రశ్నించేందుకు ఎన్సీబీ రంగం సిద్ధం చేసింది. విచారణలో పాల్గొనేందుకు శ్రుతి ఎన్సీబీ గెస్ట్ హౌస్కు కూడా చేరుకున్నారు. అధికారి కరోనా బారినపడడంతో సుశాంత్ మాజీ బిజినెస్ మేనేజర్ శ్రుతి మోదీని ప్రశ్నించడం ఆగిపోయినట్టు ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ కేపీఎస్ మల్హోత్రా తెలిపారు.
previous post
next post