సురేందర్రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్పై మెగాస్టార్ చిరంజీవి తొలి చారిత్రక చిత్రం “సైరా నరసింహారెడ్డి” వెండితెరపై ప్రేక్షకులను మెప్పిస్తోంది. రామ్ చరణ్ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు ప్రపంచ వ్యాప్తంగా 5 భారతీయ భాషల్లో విడుదలైన విషయం తెలిసిందే. అత్యంత ప్రతిష్టాత్మకంగా అమితాబ్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, అనుష్క, తమన్నా, నయనతార లాంటి భారీ తారాగణంతో రూపొందించారు. తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన “సైరా” చిత్రాన్ని దేశ వ్యాప్తంగా అన్ని భాషల వాళ్లూ ఆదరిస్తూ సినిమాను విజయవంతం చేశారు. ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్ తెలిపేందుకు చిత్రయూనిట్ ప్రెస్మీట్ను నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో దర్శకుడు సురేందర్రెడ్డి మాట్లాడుతూ “సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని మొదలు పెట్టి 3 సంవత్సరాలు అయింది. అప్పుడే మూడేళ్లు అయిపోయిందా అన్న ఫీలింగ్ నాకు బుధవారం సినిమా విడుదలయినప్పుడు అనిపించింది. చిరంజీవి గారు స్క్రిప్ట్ ఓకే అన్నాక నిద్ర లేకుండా ఎన్నో రాత్రులు గడిపాను. ఒక చారిత్రాత్మక చిత్రం ఇందులో పాటలు, డ్యాన్స్లు ఉండవు. మెగాభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే టెన్షన్ ఒక వైపు, సినిమా క్లైమాక్స్ను ప్రేక్షకులు ఒప్పుకుంటారో లేదో అనే భయం మరో వైపు. విడుదలై టాక్ బయటికి వచ్చే వరకు ఎంతో టెన్షన్ని అనుభవించాను. కానీ ఇంత పెద్ద బ్లాక్బస్టర్ ఇస్తారని అస్సలు ఊహించలేదు. చిరంజీవిగారి అభిమానులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మా టెక్నీషియన్స్ అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. రామ్ చరణ్గారు చిరంజీవిగారి కలను నిజం చేశారు. ఆ డ్రీమ్ని నా ద్వారా ఫుల్ఫిల్ చేయించినందుకు సంతోషంగా ఉన్నాను. ఈ చిత్రం కోసం 500 మంది ఫ్యామిలీస్ కష్టపడ్డారు. దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయవద్దు. ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు” అని అన్నారు.