telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

సుప్రీం లో గెలిచిన ..అపోలో యాజమాన్యం .. విచారణకు స్టే ..

Jayalalitha Medical Bills

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి కేసు విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించింది. విచారణ జరుపుతున్న కమిషన్ పై అపోలో ఆసుపత్రి యాజమాన్యం అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ ను మద్రాస్ హైకోర్టు కొట్టి వేసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టును అపోలో యాజమాన్యం ఆశ్రయించింది. పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు… అరుముగస్వామి కమిషన్ విచారణపై స్టే విధించింది. జయ వ్యక్తిగత వైద్యుడు శివకుమార్ సహా 100 మందికి పైగా వ్యక్తులను అరుముగస్వామి కమిషన్ ప్రశ్నించింది. వీరిలో అపోలో ఆసుపత్రి రేడియాలజిస్ట్ డాక్టర్ మీరా, ఎమర్జెన్సీ డాక్టర్ పజని కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో, తమ వైద్యులను కమిషన్ వేధిస్తోందంటూ అపోలో యాజమాన్యం కోర్టును ఆశ్రయించింది.

ఇక దివంగత జయలలిత నివాసమైన వేద నిలయాన్ని ఆదాయపు పన్ను బకాయిల నిమిత్తం జప్తు చేశామని మద్రాసు హైకోర్టుకు ఐటీ శాఖ తెలిపింది. జయ మరణం తర్వాత ఆమె ఆస్తులను నిర్వహించేందుకు ప్రత్యేక కమిటీని వేయాలని కోరుతూ అన్నాడీఎంకే ప్రముఖుడు పుహలేంది మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. జయలలితకు రూ. 913 కోట్లకు పైగా ఆస్తులున్నాయని పిటిషన్ లో ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం పిటిషన్ పై విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి చెన్నై ఐటీ అధికారులు ఒక అఫిడవిట్ దాఖలు చేశారు. పోయస్ గార్డెన్ లోని జయ నివాసమైన వేద నిలయంతో పాటు ఆమె ఆస్తులను జప్తు చేసినట్టు అందులో పేర్కొన్నారు.

వేద నిలయంతో పాటు హైదరాబాదులో ఉన్న ఇల్లు, మరో మూడు ఆస్తులు జప్తు చేశామని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో ఐటీ అధికారులు తెలిపారు. 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను ఐటీ రిటర్న్స్ ప్రకారం జయకు రూ. 16.37 కోట్ల విలువైన స్థలం, కారు, బ్యాంక్ లో రూ. 10 కోట్లు ఉన్నాయి. 1990 నుంచి 2012 వరకు జయ పన్ను చెల్లింలేదు. ఇదే విధంగా 2005-06 నుంచి 2011-12 వరకు రూ. 6.62 కోట్ల పన్ను చెల్లించలేదు. ఈ నేపథ్యంలో రూ. వెయ్యి కోట్ల విలువ ఉండే జయ ఆస్తుల నిర్వహణకు ప్రత్యేక కమిటీ వేయాలని కోరడం సరికాదని అన్నారు. తదుపరి విచారణను జూన్ 6వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.

Related posts