నిమ్మగడ్డ రమేష్కుమార్ కేసులో మరోసారి ఏపీ సర్కార్కు సుప్రీంలో చుక్కెదురైంది. ఆయన కేసులో హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఎస్ఈసీ తొలగింపు విషయంలో ప్రభుత్వ ఉద్దేశం సరిగ్గా లేదని ధర్మాసనం తప్పుపట్టింది. మధ్యంతర ఆదేశాలు ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది. అటు, ఎన్నికల నిర్వహణపైనా మాట్లాడదలుచుకోలేదని చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే స్పష్టం చేశారు.
విచారణ సందర్భంగా ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వొకేట్ రాకేశ్ ద్వివేది వాదనలు వినిపించారు. హైకోర్టు ఉత్తర్వుల కారణంగా గతంలోని అధికారులు కూడా పనిచేయలేకపోతున్నారని వివరించారు. మధ్యంతర ఎస్ఈసీని నియమించేలా గవర్నర్ కు సూచించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. అయితే ఏపీ ప్రభుత్వ న్యాయవాది సూచనలను న్యాయస్థానం తిరస్కరించింది. గవర్నర్ కు ఈ దశలో సూచన చేయలేమని చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే తేల్చి చెప్పారు. తాజాగా ఈ కేసు విచారణను మూడు వారాలకు సుప్రీంకోర్టు వాయిదా వేసింది.