కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం భార్య నళిని, ఆయన కుమారుడు కార్తీ చిందంబరంలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. నల్లధనం కేసుకు సంబంధించి వీరిపై ఉన్న అభియోగాలను గత ఏడాది మద్రాసు హైకోర్టు కొట్టి వేసింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఐటీ శాఖ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.
ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఇదే సమయంలో వివరణ ఇవ్వాలంటూ నళిని, కార్తీలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. చిదంబరం భార్య, కుమారుడు, కూమార్తెలకు విదేశాల్లో అక్రమాస్తులు, రహస్య బ్యాంకు ఖాతాలు ఉన్నట్టు ఐటీ శాఖ ఆరోపించింది.