డిగ్రీ, పీజీ ఫైనలియర్ పరీక్షలు నిర్వహించవలసిన అవసరం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పరీక్షలను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు తిరస్కరించింది. కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు సొంతంగా నిర్ణయం తీసుకుని వాటిని వాయిదా వేయవచ్చని పేర్కొంది. పరీక్షలు రాయకుండా మాత్రం ఎవరినీ పాస్ చేయవద్దని సూచించింది. పరీక్షల నిర్వహణపై యూజీసీ గైడ్లైన్స్ని ప్రతి ఒక్కరూ పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.
ఇప్పటికే విద్యార్థులు ఐదు సెమిస్టర్లు పూర్తి చేశారని, వాటి ఆధారంగా తుది పరీక్షల ఫలితాలు ప్రకటించాలని కోరిన పిటిషన్ల వాదనలతో సుప్రీంకోర్టు ఏకీభవించలేదు. పరీక్షలు నిర్వహించకుండా పై తరగతులకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రమోట్ చేయడానికి వీల్లేదని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాలు యూజీసీతో సంప్రదింపులు జరిపి పరీక్షల నిర్వహణ తేదీలను ఖరారు చేయవచ్చని పేర్కొంది.