భూమండలాన్ని అతలాకుతలం చేయగల భారీ అగ్నిపర్వత పేలుడు సమీప భవిష్యత్తులోనే జరగనుందా? దాంతో ప్రపంచ పటంలో అగ్రరాజ్యం అమెరికా మాయం కానుందా? మానవాళి మనుగడకే ముప్పు వాటిల్లనుందా? అంటే అవుననే అంటున్నాడు పోలండ్కు చెందిన భూగోళ శాస్త్రవేత్త డాక్టర్ జెర్జీ జాబా. ఆయన చేసిన అంచనా ప్రకారం సమీప భవిష్యత్తులో అమెరికాలో ఓ భారీ అగ్నిపర్వత పేలుడు సంభవించనుంది. ఈ పేలుడు సంభవించిన కేంద్రం నుంచి సుమారు 500 కిలోమీటర్ల ప్రాంతం లావాలో మునిగిపోతుంది. అంతేకాక దీని నుంచి వెలువడే రసాయనిక వాయువులు భూ వాతావరణాన్ని పూర్తిగా కప్పేస్తాయి. చాలా కాలం వరకూ సూర్యుడు మనకు కనిపించడు. ఈ కృత్రిమ శీతాకాలంలో భూగోళం ఉండగానే.. ఆహార కొరతతో సుమారు 500 కోట్ల జనాభా అంతరిస్తుందని జెర్జీ తెలిపారు.
ఈ అగ్నిపర్వత పేలుడును అరికట్టలేమని, ఇది ఎప్పుడు సంభవించేదీ కచ్చితంగా చెప్పలేమని ఆయన అన్నారు. అమెరికాలో అగ్నిపర్వత పేలుడు సంభవించే ఎటువంటి సూచనలు కనిపించినా వెంటనే ప్రజలు అప్రమత్తమై అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. ఇలాంటి పేలుళ్లను సూపర్ వాల్కనో ఎరప్షన్ అంటారని, ఇవి సుమారు 50 వేల ఏళ్లకు ఒకసారి సంభవిస్తాయని చెప్పారు. ప్రపంచ చరిత్రలో ఇలాంటి ప్రమాదం చిట్టచివరిసారి 74 వేల సంవత్సరాల క్రితం ఇండోనేషియాలో సంభవించిందని గుర్తుచేశారు. అలాగే చరిత్రను ఒకసారి తిరగేస్తే అమెరికాలోని ఎల్లోస్టోన్ నేషనల్ పార్కులో ఉన్న అగ్నిపర్వతం ఇప్పటికి మూడుసార్లు లావా ఎగజిమ్మిందని, ఈ అగ్నిపర్వతం గనుక మరోసారి పేలితే మానవజాతి మనుగడకు ముప్పు తప్పదని హెచ్చరించాడు. జెర్జీ అంచనాలు నిజమే అనిపించేలా ఎల్లోస్టోన్ పార్కు పరిసర ప్రాంతాల్లో ఇటీవల ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉండటం గమనార్హం.
కేసీఆర్ నన్ను అవమాన పరిచారు.. కోరుట్ల ఎమ్మెల్యే కంటతడి