ఏపీ రాజధానులపై నియమించిన జీఎన్ రావు కమిటీ తన తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. రాష్ట్రాన్ని నాలుగు భాగాలుగా విభజించి అభివృద్ధి చేయాలని కమిటీ సూచించింది. జీఎన్ రావు కమిటీ నివేదికపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి స్పందించారు. కమిటీ రిపోర్ట్ ను పరిశీలిస్తే విశాఖను రాజధానిగా చేయాలని సూచిస్తున్నట్టుగా ఉందని అభిప్రాయపడ్డారు. రాజధానికి కేంద్రం నిధులు ఇచ్చింది కాబట్టి మార్పుపై ప్రశ్నించే హక్కు ఉందని స్పష్టం చేశారు.
ఇక మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, 3 రాజధానులు కాకపోతే 33 రాజధానులు పెట్టుకుంటామనడం మరీ విడ్డూరంగా ఉందని అన్నారు. రాజధాని రైతుల జీవితాలతో చెలగాటమాడవద్దు అని హితవు పలికారు. రాజధాని విషయంలో చంద్రబాబు ఇప్పటికే ఐదేళ్లు వృధా చేశారని చెప్పారు. ఇప్పుడు వైసీపీ మళ్లీ మొదటికి వచ్చిందని సుజన ఆవేదన వ్యక్తం చేశారు.