బిగ్బాస్ రియాలిటీ షో 5వ ఎడిషన్ విజయవంతంగా కొనసాగుతోంది. ఇక బిగ్బాస్ కేవలం వినోదాన్ని పంచే కార్యక్రమమే కాదని, ప్రజలకు అవగాహన పెంచేది కూడా అని నిర్వాహకులు నిరూపించారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ మెట్రో బిగ్బాస్ రియాలిటీ షోతో కలిసి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు.
దీనిపై ఇప్పటికే ఎల్ అండ్ టీ ప్రతినిధులు హీరో, బిగ్బాస్ హోస్ట్ నాగార్జునను కలిశారు. ఈ కార్యక్రమంలోనే భాగంగా మెట్రోలో ప్రయాణించే సమయంలో ప్రయాణికులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.? ఎలాంటి పనులు చేయకూడదు అన్ని వివరాలతో కూడిన హోర్డింగ్స్ను మెట్రో స్టేషన్లో ఏర్పాటు చేయనున్నారు.
హైదరాబాద్ మెట్రో రైల్లో ప్రయాణించేటప్పుడు అనుసరించాల్సిన ముందు జాగ్రత్తలను గురించి అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రచారం ప్రారంభించారు. ఈ పౌరస్పృహ కార్యక్రమాన్ని నగరంలోని 57 మెట్రో స్టేషన్లలోని కాన్కోర్స్, ఎంట్రీ–ఎగ్జిట్ మరియు చెక్ ఇన్ ప్రాంగణాలలో చేస్తున్నారు. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన జింగిల్స్తో పాటుగా అదే తరహా సందేశాలను సైతం అన్ని మెట్రో రైళ్లలోనూ ప్రచారం చేస్తున్నారు.
ఈ క్యాంపెయిన్ను మొత్తం బిగ్బాస్ సీజన్ 100 రోజులూ ప్రచారం చేయనున్నారు.
తద్వారా మెట్రో కమ్యూటర్లు ప్రయాణ సమయాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటుగా మెట్రో స్టేషన్ ప్రాంగణాలలో అనుసరించాల్సిన విధానాలను గురించి అవగాహన కల్పించనున్నారు. దీనిలో భాగంగా భద్రతా ప్రమాణాలు, మెట్రో నిబంధనలు, తమ సౌకర్యం కోసం సరైన విధానంలో మరింతగా వినియోగించడం వంటి అంశాల పట్ల అవగాహన కల్పించడం వంటివి తెలుపనున్నారు.
బిగ్బాస్ హోస్ట్ అక్కినేని నాగార్జున మాట్లాడుతూ ‘‘ వినోదానికి ఓ సహేతుకమైన విధానమంటూ ఉండాలి. ఈ ప్రచారం ఆ విధానానికి చక్కటి ప్రాతినిధ్యం వహిస్తుంది. బిగ్బాస్ అనేది పూర్తి వినోదాత్మక కార్యక్రమం. భావోద్వేగాలను తట్టి లేపుతుంది. ఈ ప్రచారం ద్వారా భద్రత పట్ల మరింత అవగాహన సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రయాణీకులకు చక్కటి విలువను జోడించనుంది. స్టార్ మా మరియు ఎల్టీఎంఆర్హెచ్ఎల్ ఈ తరహా సృజనాత్మక మరియు సామాజికంగా బాధ్యతాయుతమైన ప్రచారం కోసం ముందుకు రావడం సంతోషంగా ఉంది’’అని అన్నారు.
ఇక ఎల్ అండ్ టీ ప్రతినిధులు ఈ విషయమై మాట్లాడుతూ.. ‘‘ బిగ్బాస్ సీజన్–3 కోసం 2019లో మేము స్టార్ మాతో విజయవంతంగా భాగస్వామ్యం చేసుకున్నాము. మరోమారు ఉత్సాహపూరితమైన భాగస్వామ్యంను హైదరాబాద్ మెట్రో రైల్తో పాటు స్టార్ మా మరియు బిగ్ బాస్ సీజన్5 చేసుకోవడం పట్ల సంతోషంగా ఉన్నాము. వారి పర్యావరణ అనుకూల మరియు సురక్షితమైన ట్రావెల్ భాగస్వామిగా మేము నిలుస్తున్నాం. ఈ భాగస్వామ్యంలో భాగంగా మేము బిగ్బాస్ ఈజ్ వాచింగ్ ప్రచారం ను మా మెట్రో స్టేషన్ల వద్ద ప్రారంభించాము.
దీనిద్వారా కోవిడ్ భద్రతా అవగాహన మరియు సురక్షిత ప్రయాణ పద్ధతులు వంటి వాటిపట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాము. ఈ ప్రచారం ద్వారా స్మార్ట్ ట్రావెల్ అలవాట్లను ప్రయాణీకుల నడుమ పెంపొందించడానికి ప్రయత్నిస్తున్నాము. దీనిద్వారా మెట్రో ప్రయాణీకులు మొబైల్ క్యుఆర్ టిక్కెట్లు, స్మార్ట్ కార్డులను సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన ప్రయాణం కోసం వినియోగించాల్సిందిగా చెబుతున్నాం. బిగ్బాస్ సీజన్ 5 అపూర్వ విజయం సాధించాలని సూపర్ స్టార్ నాగార్జున మరియు స్టార్ మా నెట్వర్క్కు నా ఆకాంక్షలను తెలియజేస్తున్నాను’’ అని అన్నారు.