సిద్ధిపేట పట్టణంలో సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా కస్టమర్లను ఆకర్షించేందుకు పది రూపాయలకే చీర అని ప్రకటించింది. దీంతో పరిసరాల ప్రాంతాల నుంచి షాపింగ్ మాల్కు మహిళలు భారీగా తరలివచ్చారు. పెద్ద సంఖ్యలో మహిళలు తరలిరావడంతో వీరిని అదుపు చేయడం షాప్ నిర్వాహకులకు కష్టంగా మారింది. తక్కువ ధరలో లభ్యమయ్యే చీరలను దక్కించుకునేందుకు మహిళలు పోటీ పడటంతో తొక్కిసలాట చోటు చేసుకుంది.
ఈ ఘటనలో 20 మంది మహిళలకు గాయాలయ్యాయి. కొంతమంది మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా దొంగలు సైతం తమ చేతివాటం చూపారు. చీరలకు ఆశపడి వచ్చిన కస్టమర్ల నగలు, మొబైల్ ఫోన్లు,పర్సులు దొంగలించేశారు. ఓ మహిళ నుంచి దుండగులు 5 తులాల బంగారం చోరీ చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. కాగా, సరైన ఏర్పాట్లు చేయకుండా తమను ఇబ్బంది పెట్టిన షాపింగ్ మాల్ నిర్వాహకులపై మహిళలు మండిపడుతున్నారు.