ఒంటిపూట బడులు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 12 వరకు కొనసాగుతాయి. ఒంటిపూట బడులను ఉ. 8గంటల నుంచి మ. 12:30 గంటల వరకు నిర్వహించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే శనివారం నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభంకానున్న నేపథ్యంలో పరీక్ష కేంద్రం ఉన్నటువంటి పాఠశాలలను మాత్రం మ. 1గంటల నుంచి సా. 5గంటల వరకు నిర్వహించాలని పాఠశాల విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇది కేవలం పది పరీక్షలు ఉన్నంత వరకు మాత్రమేనని సూచించింది. మధ్యాహ్నం 12:30 తర్వాత విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టాలని ఆదేశించింది.
ఈనెల 16వ తేదీ నుంచి 10వ తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఏప్రిల్ 3వ తేదీ వరకు జరిగే ఈ పరీక్షల నిర్వహణకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. పరీక్షలు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతాయని, 9:35 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 5,52,302 మంది విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపారు.