శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం ఉదయం పద్మావతి అమ్మవారు పెద్ద శేషవాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శ్రీపద్మావతి అమ్మవారికి కార్తీక బ్రహ్మోత్సవాలలో రెండవ వాహనం పెద్దశేషుడు.
లక్ష్మీ సహితుడైన శ్రీవారికి దాసుడిగా, సఖుడిగా, శయ్యగా, సింహాసనంగా, ఛత్రంగా సమయోచితంగా పెద్దశేషుడు సేవలందిస్తాడు. శ్రీవారి పట్టమహిషి అలిమేలు మంగకు వాహనమై తన విశేష జ్ఞానబలాలకు తోడైన దాస్యభక్తిని తెలియజేస్తున్నాడు. సర్పరాజైన శేషుని వాహన సేవను తిలకించిన వారికి యోగశక్తి కలుగుతుంది. కాగా తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. డిసెంబరు 1వ తేదీ వరకు ఉత్సవాలు జరుగనున్నాయి.