శ్రీలంకలో ఆర్థిక, ఆహార, రాజకీయ సంక్షోభం మరింత తీవ్రతరమైంది. కొన్ని రోజులుగా కనీస అవసరాలకు సరుకులు దొరక్క సామాన్యుల ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి.
తాజాగా శ్రీలంకలో విధించిన ఎమర్జెన్సీని ఎత్తివేస్తూ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంగళవారం అర్ధరాత్రి ప్రకటన విడుదల చేశారు.
తీవ్ర ఆర్ధిక సంక్షోభం నేపథ్యంలో నిత్వావసర వస్తువుల ధరలు పెరగడంతో పాటు ఆసుపత్రుల్లో ఔషధాల కొరత, పెట్రోల్ బంకుల దగ్గర పడిగాపులు కాస్తుండటం, విద్యుత్ సంక్షోభం నేపథ్యంలో ప్రజలు రోడ్లపైకి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు గొటబయ రాజపక్స ఇంటిని ఆందోళనకారులు ముట్టడించారు.
ఆందోళనలను అణచివేసేందుకు సైన్యానికి సర్వాధికారులు ఇచ్చారు. అయినప్పటికీ దేశ వ్యాప్తంగా ప్రజలు ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలను అణచివేయడానికి రాజపక్స ఏప్రిల్ 1 నుంచి శ్రీలంకలో అత్యవసర పరిస్థితి విధించారు.
ఎమర్జెన్సీ ప్రకటించిన తర్వాత పార్లమెంట్ సమావేశాలు జరగ్గా, అధికార కూటమి నుండి 41 మంది సభ్యులు వాకౌట్ చేయడంతో అధ్యక్షుడు గోటబయ రాజపక్స సంకీర్ణ ప్రభుత్వం మెజారిటీని కోల్పోయింది.
ప్రభుత్వంపై వ్యతిరేకత రావడంతో సోమవారం నాడు కేంద్ర కేబినెట్ మంత్రులందరూ మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ప్రభుత్వంలో చేరాలని అధ్యక్షుడు రాజపక్స చేసిన ఆహ్వానాన్ని శ్రీలంక ప్రతిపక్షం తిరస్కరించింది.
దీంతో అధ్యక్షుడు గోటబయ రాజపక్స, ఆయన సోదరుడైన ప్రధానమంత్రి మహింద రాజపక్స ఇబ్బందుల్లో పడ్డారు. అయితే.. ఎమర్జెన్సీ ఎత్తివేయడమే సరైన నిర్ణయమని భావించి రాత్రికి రాత్రే ఆ దేశ అధ్యక్షుడు ప్రకటించారు.
సచివాలయం కట్టడం కాదు పేదలకు ఇల్లు కావాలి.. కేసీఆర్ పై భట్టి ఆగ్రహం