telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

కరోనా ఎఫెక్ట్ : శ్రీలంకలో అతి పెద్ద క్రికెట్ స్టేడియం నిర్మాణం రద్దు

Srilanka

శ్రీలంకలో అతి పెద్ద క్రికెట్ స్టేడియాన్ని నిర్మించాలని ఆశించిన శ్రీలంక క్రికెట్ బోర్డుకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. హోమాగమా వేదికగా ఈ స్టేడియం నిర్మాణం కోసం ఇప్పటికే 26 ఎకరాల స్థలాన్ని కూడా శ్రీలంక క్రికెట్ బోర్డు పరిశీలించింది. కానీ.. కరోనా వైరస్ కారణంగా ఆర్థికంగా నష్టపోయిన శ్రీలంక ఇప్పట్లో కోలుకునేలా కనిపించడం లేదు. దాంతో.. స్టేడియం నిర్మాణం విషయంలో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. శ్రీలంక 2023, 2031లో వరల్డ్‌కప్‌కి ఆతిథ్యమివ్వబోతోంది. ఈ నేపథ్యంలో.. ఐసీసీ ఈవెంట్స్‌కి అనుగుణంగా స్టేడియాన్ని అత్యాధునికంగా నిర్మించాలని శ్రీలంక క్రికెట్ బోర్డు ఆశించింది. మూడేళ్ల వ్యవధిలో ఆ స్టేడియం నిర్మాణ పనులు పూర్తవుతాయని అంచనా వేసిన శ్రీలంక.. సీటింగ్ సామర్థ్యం 40వేలుగా నిర్ణయించింది. కానీ.. కరోనా వైరస్ కారణంగా ఆ ప్రాజెక్ట్‌ రద్దయింది. ఇక శ్రీలంకలో ఇప్పటికే కొలంబో, దంబుల్లా, పల్లెకలె, హంబన్‌టోట, కాండీ, గాలె, మొరటువా రూపంలో ఏడు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాలు ఉన్నాయి. అయితే వాస్తవానికి ఈ స్టేడియం నిర్మాణ ప్రతిపాదనపై ఇటీవల ఆ దేశ మాజీ కెప్టెన్ మహేల జయవర్దనె తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. ఇప్పటికే దేశంలో ఉన్న కొన్ని స్టేడియాల్లో సరిగా మ్యాచ్‌లు కూడా జరగడం లేదని గుర్తు చేసిన జయవర్దనె.. సుమారు రూ. 300 కోట్లతో కొత్త స్టేడియాన్ని కట్టాల్సిన అవసరం ఏంటి..? అని ప్రశ్నించాడు. దాంతో.. శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారులు, మాజీ క్రికెటర్లతో చర్చలు జరిపిన శ్రీలంక ప్రభుత్వం.. ఆ స్టేడియం నిర్మాణ ప్రాజెక్ట్‌ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. స్టేడియానికి ఖర్చు చేయాలనుకున్న నిధుల్ని లోకల్ స్టేడియాల్లో మెరుగు సదుపాయాలకి, స్కూల్ క్రికెట్‌ డెవలప్‌మెంట్‌కి వినియోగించబోతున్నట్లు శ్రీలంక ప్రధాని మహింద రాజపక్సే వెల్లడించారు.

Related posts