telugu navyamedia
క్రీడలు వార్తలు

విలియమ్సన్ ఇంకా కోలుకోలేదు.. అందుకే ఆడలేదు

నిన్న జరిగిన మ్యాచ్ లో 16 ఓవర్ల వరకు మ్యాచ్‌ను తమ చేతుల్లో ఉంచుకున్న ఆరెంజ్ ఆర్మీ.. స్పిన్నర్ షాబాజ్ అహ్మద్(3/7) కొట్టిన దెబ్బకు నిలువెల్లా వణికిపోయింది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి చేజేతులా ఓటమిని కొని తెచ్చుకుంది. ఆఖరి బంతి వరకు థ్రిల్లింగ్‌గా సాగిన మ్యాచ్‌లో 6 పరుగుల స్వల్ప తేడాతో నెగ్గిన బెంగళూరు.. సెకండ్ విక్టరీతో టేబుల్ టాపర్‌గా నిలిచింది. అయితే ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ ఓటమికి టీమ్‌మేనేజ్‌మెంట్ పసలేని ప్రణాళికలు కూడా కారణమని మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు. తుది జట్టు ఎంపిక కూడా బాలేదని మండిపడ్డారు. అసలు కేన్ విలియమ్సన్‌ను ఎందుకు ఆడించడం లేదని ప్రశ్నిస్తున్నారు. దీని పై సన్‌రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్ ట్రెవర్ బైలిస్ ఈ విమర్శలపై వివరణ ఇచ్చాడు. కేన్ విలియమ్సన్ గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతోనే అతన్ని తుది జట్టులోకి తీసుకోలేదని స్పష్టం చేశాడు. అతను బరిలోకి దిగడానికి ఇంకాస్త సమయం పడుతుందన్నాడు. ప్రస్తుతం అతను నెట్ ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంటున్నాడని, అతి త్వరలో మైదానంలోకి బరిలోకి దిగుతాడని తెలిపాడు. ‘ఆర్‌సీబీతో మ్యాచ్‌కు ముందు మేం రెండు రోజులు ప్రాక్టీస్ నిర్వహించాం. ఇందులో ఒకరోజు కేన్ విలియమ్సన్ పాల్గొన్నాడు. అతి త్వరంలోనే అతను మ్యాచ్ బరిలో దిగుతాడు.’అని సన్‌రైజర్స్ కోచ్ స్పష్టం చేశాడు. ఇక ఫస్ట్ మ్యాచ్‌లో గాయపడ్డ మహ్మద్ నబీకి కోలుకునేందుకు విశ్రాంతి ఇచ్చామని, అందుకే అతని స్థానంలో జాసన్ హోల్డర్‌ను తీసుకొచ్చామన్నాడు.

Related posts