ఆర్టీసీ మహాశివ రాత్రికి శైవ క్షేత్రాలకు రీజియన్ వ్యాప్తంగా 777 సర్వీసులు ఏర్పాటు చేయనున్నట్లు రీజనల్ మేనేజర్ ఎస్టీపీ రాఘవకుమార్ తెలిపారు. గుంటూరు ఎన్టీఆర్ బస్టాండ్లోని తిక్కన సమావేశ మందిరంలో ఆయన మహాశివరాత్రి ఏర్పాట్లుపై డిపో మేనేజర్లతో సమావేశం నిర్వహించారు. కోటప్ప కొండ తిరునాళ్ళను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లు చెప్పారు. కోటప్పకొండ జాతరను ఆరు బేస్ క్యాంపులుగా విభజిస్తూ ఒక్కో క్యాంపునకు ఒక సీనియర్ స్కేల్ అధికారిని కేటాయించి జాతరలో పాల్గొనే ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా రద్దీకనుగుణంగా అదనపు సర్వీసులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
వీఐపీలకు కొండపైకి వెళ్ళేందుకు ప్రత్యేకఅదనపు సర్వీసులను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. కొండపైకి వెళ్ళేందుకు ఘాట్రోడ్డులో రాకపోకలు సాగించేలా బస్సు డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ కల్పించనున్నట్లు పేర్కొన్నారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో వ్యవహరించాలన్నారు. సమావేశంలో డిప్యూటీ సీటీఎంలు రాజశేఖర్, నర్రా శ్రీనివాసరావు, డిప్యూటీ సీఎంఈ శరత్బాబు, పీవో మాలతి, అకౌంట్స్ ఆఫీసర్లు, సివిల్ ఇంజనీర్లు, ట్రాఫిక్ ఇన్చార్జ్, మెకానికల్ ఇన్చార్జ్, సిబ్బంది ఉన్నారు.
కోటప్పకొండ జాతరకు నరసరావుపేట డిపో నుంచి 260, చిలకలూరిపేట డిపో నుంచి 120, వినుకొండ డిపో నుంచి 35, గుంటూరు-1 డిపో నుంచి అమరావతి గుడికి 20,సత్తెనపల్లి డిపోనుంచి అమరావతి గుడికి 10, మంగళగిరి డిపో నుంచి 15, బాపట్ల డిపో నుంచి 10 బస్సులు నడుపుతున్నట్లు ఆర్ఎం తెలిపారు. అలాగే క్వారీ తిరునాళ్ళకు గుంటూరు – 1 నుంచి 10, తెనాలి డిపోనుంచి 20, రేపల్లె డిపో నుంచి అరస వల్లికి 3, మాచర్ల డిపో నుంచి దైదకు 4, సత్రశా లకు 31, పిడుగురాళ్ళ డిపో నుంచి 4, జిల్లా నలు మూలల నుంచి శ్రీశైలానికి కూడా 78 ప్రత్యేక బస్సు లను నడుపుతున్నట్లు ఆర్ఎం వివరించారు.