ఆర్టీసీ అధికారులు బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆర్ఎం కార్యాలయంలో టీఎన్ఆర్టీసీ, ఏపీఎస్ ఆర్టీసీ మధ్య ఒప్పంద పత్రాలను కుదుర్చుకున్నారు. ఈ నెల 30 నుంచి వచ్చేనెల 8వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య 150 ప్రత్యేక బస్సులు నడిపేలా ఒప్పందాలను కుదుర్చుకున్నారు. ఏ రూట్లలో బస్సులు నడపాలి, పార్కింగ్ వంటి అంశాలపై చర్చించారు. పెరటాశి నెలలో భాగంగా ఈ నెల 18 నుంచి వచ్చే నెల 17వ తేదీ వరకు తమిళనాడు నుంచి ఎక్కువ సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తుంటారు. అందుకని తిరుపతి- తిరుమల మధ్య అదనపు ట్రిప్పులు (200కు పైగా) తిప్పేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ఆర్ఎం చెంగల్రెడ్డి తెలిపారు.
తిరుపతి-చెన్నై (ఊతుకోట మీదుగా) 30 బస్సులు, తిరుపతి- కాంచీపురం (వయా పుత్తూరు) 20, తిరుపతి- చెన్నై (వయా శ్రీకాళహస్తి) 5, తిరుపతి- తిరువణ్ణామలై (వయా వేలూరు) 10, తిరుపతి-వేలూరు 45, తిరుపతి- కృష్ణగిరి (వయా కుప్పం) 15, తిరుపతి- హోసూరు (కుప్పం మీదుగా) 5 బస్సులను నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీటీఎం మధుసూదన్, తిరుపతి, అలిపిరి డీఎంలు ప్రవీణ్కుమార్, ప్రశాంతి, రాజేష్కుమార్, తమిళనాడు ఆర్టీసీ అధికారులు ముత్తుకృష్ణన్, వెంకటేశం, పంచమూర్తి, రాజాశేఖర్, శ్రీధర్, శివమణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.