ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఢిల్లీలోని ఏపీ భవన్ లో చేదు అనుభవం ఎదురైంది. తమ్మినేని సతీసమేతంగా డెహ్రాడూన్ వెళ్లారు. ఆ పర్యటనను ముగించుకుని శనివారం సాయంత్రం ఆయన ఢిల్లీలోని ఏపీ భవన్ కు చేరుకున్నారు. స్వర్ణముఖి బ్లాకులోని 320 నెంబర్ గెస్ట్ రూమ్ ను ఆయనకు కేటాయించారు. నిన్న సాయంత్రం రాష్ట్రానికి తిరిగి వచ్చే సమయంలో ఏపీ భవన్ కు చెందిన ఉద్యోగి సార్, వసతి, భోజనం బిల్లును కట్టండి అని చెప్పారు.
రాష్ట్ర అతిథి హోదాలో ఉన్న తనను బిల్లు కట్టమని అడగడమేంటని ఆయన మనస్థాపానికి గురయ్యారు. ఇదే విషయాన్ని సదరు ఉద్యోగిని తమ్మినేని అడిగారు. దీనికి సమాధానంగా ఆ ఉద్యోగి మాట్లాడుతూ అమరావతిలో ఉండే సాధారణ పరిపాలన విభాగం నుంచి మీకు స్టేట్ గెస్టుగా కాకుండా, కేటగిరి-1లో వసతి ఏర్పాటు చేయాలని తమకు ఆదేశాలు వచ్చాయని తెలిపారు. దీంతో ముందు బిల్లు కట్టేయండి… తర్వాత సంగతి తాను చూసుకుంటానని తన సిబ్బందికి తమ్మినేని చెప్పారు.