సౌదీ అరేబియా కఠిన చట్టాలకు పెట్టింది పేరు, అలాంటి దేశంలో తీవ్రవాదులకు తాజాగా 37 మందికి మరణశిక్ష అమలు చేసింది. సౌదీ అధికారిక మీడియా సంస్థ సౌదీ ప్రెస్ ఏజెన్సీ ఈ మేరకు వివరాలు తెలిపింది. దేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై వాళ్లకు మరణశిక్ష విధించినట్టు పేర్కొంది. ఈ మరణశిక్షలు రియాద్, మక్కా, మదీనా, సెంట్రల్ ఖాసిం ప్రావిన్స్, ఈస్ట్రన్ ప్రావిన్స్ లలో అమలు చేశారు.
ఆ 37 మందికి, ఉగ్రవాద భావజాలాన్ని తలకెక్కించుకోవడం, అతివాద ధోరణి, దేశభద్రతను అస్థిరపరిచేందుకు టెర్రరిస్ట్ సెల్స్ ఏర్పాటు వంటి అభియోగాలపై మరణశిక్ష విధించారు. వారిలో ఒకరిని మరణశిక్ష అనంతరం స్తంభానికి వేలాడదీసినట్టు సమాచారం. మరీ తీవ్రమైన నేరాలకు పాల్పడినవాళ్లకు ఇలాంటి శిక్ష విధిస్తారు. సాధారణంగా సౌదీలో మరణశిక్ష అంటే శిరచ్ఛేదంతో చంపేస్తారు. దేశంలో ఈ ఏడాది ఇప్పటివరకు 100 మందికి మరణశిక్ష విధించినట్టు సౌదీ మీడియా పేర్కొంది.