కరోనా కాలం నటుడు సోనూసూద్ జీవితాన్ని మార్చేసింది. సినిమాల్లో విలన్ గా ఎంతో పేరు తెచ్చుకున్న సోనుసూద్.. నిజ జీవితంలో మాత్రం తను చేస్తున్న సేవలతో హీరోగా మారిపోయాడు.
చిత్తూరు జిల్లా మదనపల్లె రైతుకు చేయూతనిచ్చేందుకు సోనూ సూద్ ముందుకు వచ్చారు. తండ్రి వ్యవసాయ పనుల్లో కాడెద్దులుగా మారిన కూతుళ్లను వీడియోలో చూసిన ఆయన వేదన చెందారు. వెంటనే ఆయన ట్వీట్ చేస్తూ రేపు ఉదయానికల్లా రెండు ఎద్దులు ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. ఇకపై ఆ ఆడపిల్లలు ఇద్దరు చక్కగా చదువుకోవచ్చని ట్వీట్ చేశారు. ఆ తర్వాత కాసేపటికే మరో ట్వీట్ చేస్తూ ‘కొన్ని గంటల్లో రైతుకు ట్రాక్టర్ అందజేస్తానని ప్రకటించాడు. చెప్పిన నాలుగు గంటల్లోనే ఆ రైతుకు ట్రాక్టర్ ని అందించాడు.
చిత్తూరు జిల్లా కేవీపల్లె మండలం మహరాజు పల్లెకు చెందిన నాగేశ్వరరావు కొన్నేళ్ల కిందట బతుకుదెరువు కోసం మదనపల్లె పట్టణానికి వలస వెళ్లి టీ దుకాణం పెట్టుకున్నాడు. కరోనాతో షాపు నడవక మూత వేసి ఇటీవల సొంతూరికి చేరుకున్నాడు. ఖరీఫ్ మొదలవడంతో వేరుశనగ సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు.
This family doesn’t deserve a pair of ox 🐂..
They deserve a Tractor.
So sending you one.
By evening a tractor will be ploughing your fields 🙏
Stay blessed ❣️🇮🇳 @Karan_Gilhotra #sonalikatractors https://t.co/oWAbJIB1jD— sonu sood (@SonuSood) July 26, 2020
అయితే పొలంలో దున్నడానికి ఎద్దులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అసలే సీజన్ కావడంతో … అటు పొలం పనులు మొదలు పెట్టలేక.. దున్నేందుకు ఎద్దులు లేక సతమతమవుతుంటే.. ఆయన కన్నబిడ్డలే కాడి పట్టుకు నడిచారు. వాళ్లిద్దరూ కాడి లాగుతుంటే… వెనక నుంచి రైతు, ఆయన భార్య విత్తనాలు వేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళ కష్టాన్ని చూసిన ఓ వ్యక్తి వీడియో తీసి ట్విట్టర్లో అప్ లోడ్ చేశాడు. వైరల్ అయిన ఈ వీడియో సోనూసూద్ కంట పడింది. వెంటనే సాయం చేయడానికి ఆయన ముందుకు వచ్చాడు. ముందు ఎద్దులు కొనిస్తానన్న సోనూ ఆ తర్వాత ట్రాక్టర్ కొనిస్తా అని ప్రకటించాడు. చెప్పిన నాలుగు గంటల్లోనే సోనాలిక ట్రాక్టర్ కంపెనీ ప్రతినిధులను రైతు ఇంటి వద్దకు పంపి ట్రాక్టర్ ని అందజేయించాడు. ఊహించని విధంగా సోనూసూద్ నుంచి అందిన కానుకను స్వీకరించిన రైతు నాగేశ్వరరావు సోనూకు కృతజ్ఞతలు తెలిపారు. సోనూసూద్ చేసిన సాయానికి సర్వత్రా ప్రసంశలు లభిస్తునాయి.