కరోనా సంక్షోభ సమయంలో సోనూ సూద్ చేస్తున్న సామాజిక సేవ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లాక్ డౌన్ సమయంలో ఉపాధి లేక అల్లాడిపోతున్న వలస కూలీలకు అన్నంపెట్టి ఆదుకోవడమే గాక సొంత బస్సుల్లో వారి వారి గ్రామాలకు చేర్చారు. కొన్ని వేల మంది వలస కూలీలను వారి వారి సొంత గూటికి చేర్చిన ఆయన పేదోడి దేవుడయ్యాడు. లాక్ డౌన్ సమయంలోనే కాదు ఇప్పటికీ ఎవరికీ ఏ సమస్య వచ్చిన ఆదుకోవడానికి ముందుకు వస్తున్నాడు. దీంతో సోనూసూద్ పై ప్రశంసల జల్లు కురుస్తోన్న విషయం తెలిసిందే. ఐక్యరాజ్యసమితి సైతం ఆయన సేవలను గుర్తించి, ప్రత్యేక అవార్డును ఇచ్చింది. తాజాగా షూటింగ్ నిమిత్తం హైదరాబాద్కు వచ్చిన సోనూసూద్ను కలిసేందుకు కొన్ని వందల కిలోమీటర్ల నుంచి ప్రజలు తరలి వచ్చారు. వారందరితో సోనూ సమావేశమై ఓపికగా సమస్యలను అడిగితెలుసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీడియోలో సోనూ.. తన దగ్గరకు వచ్చిన ప్రజల సమస్యలను వింటూ వారితో ఆప్యాయంగా మాట్లాడటం కనిపిస్తుంది. సాయం పొందినవారు కూడా సోనూను కలుసుకొని కృతజ్ఞతలు చెబుతున్నారు ‘చాలా మంది కొన్ని వందల కిలోమీటర్లు దూరం నుంచి సోనూసూద్ను కలిసేందుకు వచ్చారు. ఆయన షూటింగ్లో బిజీగా ఉన్నప్పటికీ ఓపికతో వారి సమస్యలు విని, పరిష్కారం చూపారు’ అంటూ రమేష్ బాల అనే వ్యక్తి ట్వీట్ చేశాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై సోనూసూద్ స్పందించాడు. ‘ప్రజలకు దగ్గరవ్వడానికి ఆ దేవుడు కొన్ని కొన్ని సార్లు మీలాంటి వాళ్లను ఉత్ప్రేరకంగా ఎన్నకుంటారు. మీ ప్రోత్సాహకరమైన మాటలకు ధన్యవాదాలు రమేష్’ అంటూ ట్వీట్ చేశాడు.
Some times God choses you as a catalyst to reach people.
Thank you so much Ramesh sir for your encouraging words. Humbled🙏 https://t.co/ir76mTor9K— sonu sood (@SonuSood) November 4, 2020