బాలీవుడ్ నటుడు సోనూసూద్ తన రాజకీయ ఎంట్రీపై కీలక ప్రకటన చేశారు. పంజాబ్లో 2022 ఎన్నికలకు ముందు, సోనూ సూద్ రాజకీయ పార్టీలో చేరుతాడు అనే వార్తలను ఖండించారు. అయితే తన సోదరి మాళవిక సూద్ రాబోయే పంజాజ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.
కరోనా కాలంలో ఎన్నో సహాయ కార్యక్రమాలు చేసిన బాలీవుడ్ నటుడు సోనూసూద్.. రాజకీయాల్లో చేరుతారని కొద్దికాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పంజాబ్ లోని తన నివాసం వద్ద ఆదివారం మీడియాతో మాట్లాడుతూ రాజకీయ సంబంధిత అనేక విషయాలను సోనూ సూద్ పంచుకున్నారు.
మాళవిక సూద్ ఏ పార్టీలో చేరతారని విలేకరులు అడిగిన ప్రశ్నకు, “పార్టీ ముఖ్యం కాదు, పాలసీ ముఖ్యం. నా సోదరి ప్రజలకు మరియు సమాజానికి సేవ చేస్తుంది. అయితే ఆప్, కాంగ్రెస్ రెండూ మంచి పార్టీలే అని ఆయన అన్నారు. సమయం వచ్చినప్పుడు మాళవిక ఏ పార్టీలో చేరుతారనే విషయాన్ని ప్రకటిస్తానని పేర్కొన్నారు.
పంజాబ్ ప్రజల నమ్మకం గెలుచుకునేందుకు తాము ప్రయత్నిస్తానని సోనూసూద్ తెలిపారు. ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలను నెరవేర్చేందుకు కృషి చేస్తామన్నారు. అయితే.. ఓటు వేసే సమయంలో పార్టీలను కాకుండా.. అభ్యర్థుల ముఖాలను చూసి ఓటు వేయాలని అన్నారు.
మాళవికకు హెల్త్కేర్ అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. ఎన్నికైతే, డయాలసిస్ అవసరమైన రోగులకు ఉచితంగా అందేలా చూస్తానని సూద్ చెప్పారు.
ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీలతో సమావేశమైన సోనూసూద్, శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ను కూడా కలుస్తానని వెల్లడించారు.
సోనూ సూద్ తన ఆస్తులపై ఐటీ దాడులు గురించి మాట్లాడుతూ, దీనిని “పరీక్షా సమయం అని అన్నారు. అయితే ఇది “ప్రజలకు నా సేవపై ప్రభావం చూపదు” అని అన్నారు. “నేను రైతులకు మద్దతు ఇస్తున్నాను, వారికి వారి హక్కును ఇవ్వాలని, మేము వారి వల్లే తింటున్నామని అన్నారు.