ప్రముఖ నటుడు సోనూసూద్ మరోసారి తన ఆపన్న హస్తం అందించాడు. తల్లీతండ్రి లేని ముగ్గురు పిల్లల బాధ్యత తీసుకుంటానని ప్రకటించాడు. సోనూసూద్ తీసుకున్న నిర్ణయానికి ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు. యాదాద్రి భునవగిరి జిల్లా ఆత్మకూరు మండలకేంద్రంలో ఉండే సత్యనారాయణ, అనురాధ దంపతులకు ముగ్గురు పిల్లలు. సత్యనారాయణ ఏడాది క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి తల్లి అనురాధ కూలిపనులు చేసుకుంటూ ముగ్గురు పిల్లలను పోషిస్తోంది. వారం క్రితం తల్లి అనురాధ కూడా అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో ఆ ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. పెద్ద కుమారుడు మనోహర్ తన చెల్లి, తమ్ముడి ఆలనా పాలనా చూసుకుంటున్నాడు. ఈ చిన్నారుల దీనస్థితిని రాజేశం కరణం అనే వ్యక్తి ట్విట్టర్ ద్వారా సోనూసూద్ దృష్టికి తీసుకొచ్చాడు. దీనిపై స్పందించిన సోనూసూద్..ముగ్గురు పిల్లలు అనాథలు కాదని, ఇకపై తాను వారికి అండగా ఉంటానని, ముగ్గురి పిల్లల బాధ్యత తీసుకుంటానని హామీనిచ్చి గొప్ప మనసు చాటుకున్నారు. కరోనా లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి సోనూసూద్ నిరాశ్రయులకు, పేదలకు అండగా నిలుస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు.
previous post