హర్యానా పీసీసీ రాష్ట్ర శాసనసభా పక్షనేత ఎవరన్నది అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయిస్తారని ప్రకటించింది. శుక్రవారం జరిగిన శాసనసభా పక్ష సమావేశంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు తమ నేతను ఎన్నుకోలేదు. ఈ నిర్ణయాన్ని సోనియాకే వదిలేశామని ఎమ్మెల్యే ఒకరు తెలిపారు. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీ గులాంనబీ ఆజాద్తో పాటు పీసీసీ అధ్యక్షురాలు కుమారి షెల్జా కూడా హాజరయ్యారు.
ఈ సమావేశం పూర్తవగానే సీఎల్పీ ఇద్దరు నేతల పేర్లను తెరపైకి తెచ్చింది. ఒకరు మాజీ సీఎం భూపేందర్ సింగ్ హుడా కాగా, మరొకరు కిరణ్ చౌదరి. వీరిద్దరి మధ్యే ప్రధానంగా పోటీ ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే హుడా వెనక 25 మంది ఎమ్మెల్యేలు ఉండగా, కిరణ్ వైపు మాత్రం కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 40, జేజేపీ 10, కాంగ్రెస్ 31 స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే.