రెండు రోజులుగా హెచ్ఎండీఏ పంపిణీ చేస్తున్న మట్టి గణేశ్ ప్రతిమలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. ఇంజినీరింగ్ విభాగం, అర్బన్ఫారెస్ట్రీ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో 33 సెంటర్లలో గణేశ్ విగ్రహాలు, మొక్కలను పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. వందల కాలనీల సంఘాలు, ప్రజల నుంచి మట్టి విగ్రహాలు కావాలని అభ్యర్థనలు పంపుతుండడంతో విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం వరకు పంపిణీ చేయాలని పురపాలక శాఖ, హెచ్ఎండీఏ కమిషనర్ అరవింద్కుమార్ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
మాదాపూర్లోని మై హోం, నవదీప కేంద్రంలో అరవింద్కుమార్ తన కూతురుతో కలిసి ప్రజలకు మట్టి విగ్రహాలు, మొక్కలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎస్ఈ రవీందర్, డీఈఈ రజిత తదితరులు పాల్గొన్నారు. ఇక తార్నాక సంస్థ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగులందరికీ మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో అర్బన్ ఫారెస్ట్రీ విభాగం డైరెక్టర్ శ్రీనివాస్, సీఏఓ శరత్చంద్ర, ఎస్ఈ పరంజ్యోతి, పీఆర్వో లలిత పాల్గొన్నారు.
నేడు 9 కేంద్రాలను ఏర్పాటు చేసి విగ్రహాలను అందజేయనున్నారు. మొత్తంగా గ్రేటర్ నగరంలో 1.64లక్షలు 8 ఇంచుల మట్టి విగ్రహాలను పంపిణీ చేయనున్నట్లు పీసీబీ సభ్యకార్యదర్శి వి.అనిల్కుమార్ తెలిపారు. శుక్రవారం ఒక్కరోజు మాత్రమే విగ్రహాలను పంపిణీ చేస్తామని, నగర వాసులంతా ఆయా పంపిణీ కేంద్రాల(ఉప్పల్ ఎక్స్రోడ్, ఎల్బీనగర్, మదీనాగూడ, ఐడీఏ మల్లాపూర్, నాగోలు చౌరస్తా, కూకట్పల్లి, జేఎన్టీయూ, జీడిమెట్ల రైతుబజార్, బాలానగర్-బీఆర్ దవాఖాన, సుచిత్ర ఎక్స్రోడ్స్)ను సంప్రదించి విగ్రహాలను పొందవచ్చని తెలిపారు.