36 సంవత్సరాలనాటి సంగతి . అప్పుడు నేను ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ కు కార్యదర్శిగా వున్నాను .జిఎస్ .వరదా చారి గారు అధ్యక్షులు . రాజబాబు , మాదిరెడ్డి సులోచన , పాలగుమ్మి పద్మరాజు . నీరాజనంగా జరిపిన సభా కార్యక్రమం తెలుగు సినిమాలో తన హాస్యంతో పండిత పామరులను మెప్పించిన రాజబాబు .
తెలంగాణ గడ్డ మీద పుట్టి సాహిత్య రంగంలో తనదైన ముద్ర వేసిన మాదిరెడ్డి సులోచన .సాహిత్య రంగంలోనూ , సినిమా రంగంలోనూ ప్రతిభా సంపన్నుడు పాలగుమ్మి పద్మరాజు .ఈ ముగ్గురిని ఒక్కసారి స్మరించుకుందాము .
రాజబాబు 20 అక్టోబర్ 1937న రాజమండ్రిలో జన్మించిన రాజబాబు 1960లో “సమాజం ” అనే సినిమాతో సినిమా రంగంలో ప్రవేశించాడు .అంచెలంచెలుగా ఎదుగుతూ మంచి హాస్య నటుడుగా గుర్తింపు పొందాడు . అనేక చిత్రాల్లో విషాద పాత్రల్లో నటించి మెప్పించిన నటుడు రాజబాబు .
తన పుట్టినరోజు వేడుకరోజున దాన ధర్మాలు చేసిన మానవతావాది రాజబాబు . తాగుడుకు బానిసై 14 ఫిబ్రవరి 1983లో హైద్రాబాద్లో చనిపోయాడు .రాజ బాబు నటించిన చిత్రాల్లో తిరుపతి , మాయిషి రోడ్డున పడ్డాడు, ఎవరికీ వారి యమునాతీరే , తాతా మనవడు , పిచ్చోడి పెళ్లి, ప్రేమ్ నగర్, బొమ్మా బొరుసా , కథానాయకుడు, శారద, అందాల రాముడు, సాక్షి , అల్లూరి సీతారామరాజు , అడవి రాముడు ముఖ్యమైనవి .ఆయన నటించిన చివరి సినిమా 1981లో విడుదలైన “గడసరి అత్త సొగసరి కోడలు “.1935వ సంవత్సరంలో మాదిరెడ్డి సులోచన తెలంగాణ రాష్ట్రము శంషాబాద్ లో జన్మించారు . తెలుగులో ఎమ్మె చదివిన సులోచన కొంతకాలం ఉపాధ్యాయులాలిగా పనిచేశారు .
1965లో జీవన యాత్ర పేరుతో మొదటిసారి నవల వ్రాశారు . ఈమె 72 నవలలు , 150 కథలు 2 నాటకాలు 10 నాటికలు రచించారు.సులోచన రాసిన 10 నవలలను సినిమాలుగా నిర్మించారు . అందులో తరం మారింది సినిమా ఆమెకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది .సులోచన రచనల్లో ఎక్కువగా మధ్య తరగతి, తెలంగాణ గ్రామీణ జీవితం ప్రతిబించేది .హైదరాబాద్ నల్లకుంటలో వుండే సులోచన న్యూ నల్లకుంటలో కొత్త ఇల్లు కట్టుకొని గృహ ప్రవేశం చేసిన వారం రోజుల్లోనే వంట ఇంటి గ్యాస్ ప్రమాదంలో 1983 ఫిబ్రవరిలో మరణించారు . ఈమెతో పాటు ఆమె భర్త కూడా మరణించారు . తెలంగాణ సాహిత్యంలో తనదైన ముద్ర వేశారు .
సులోచన వ్రాసిన నవలల్లో , అంతం చుసిన అసూయ, అందని పిలుపు, అగ్ని పరీక్ష , అపురూప, ఋతు చక్రం , కాంతి రేఖలు, గాజు బొమ్మలు, తరంగాలు , తరం మారింది , పులా మనసులు, ప్రేమలు పెళ్లిళ్లు , రాగమయి, వారసులు, మరీచిక, మిస్టర్ సంపత్ ఎమ్మె ముఖ్యమైనవి .పాలగుమ్మి పద్మ రాజు 24 జూన్ 1915 లో తూర్పు గోదావరి జిల్లా తిరుపతి పట్నం అనే గ్రామంలో జన్మించారు .కొంతకాలం కాకినాడ పి ఆర్ కాలేజీ లో లెక్చరర్ గా పనిచేశారు .పద్మరాజు వ్రాసిన గాలివాన , పడవ ప్రయాణం అంతర్జాతీయంగా పేరు తెచ్చిపెట్టాయి .బతికిన కాలేజీ , నల్లరేగడి ,రామ రాజ్యానికి రహదారి నవలలు ప్రసిద్ధమైనవి .1954లో “బంగారు పాప ‘సినిమాతో సినిమా రంగంలోకి ప్రవేశించారు . భాగ్య రేఖ, భక్త శబరి , శాంతి నివాసం , బికారి రాముడు ,బంగారు పంజరం ,రంగులరాట్నం , మంచివాళ్లకు మంచివాడు , శ్రీరాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్, సర్దార్ పాపారాయుడు, ఇల్లాలే దేవత, స్త్రీ చిత్రాలకు రచయితగా పనిచేశారు .
17 ఫిబ్రవరి 1983లో చనిపోయారు .పద్మ రాజు గారిది విశిష్టమైన శైలి . ఆయన కథలు, మాటలు పాటలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి . సాహిత్య రంగంలో నిష్ణాతులు పద్మరాజు .ఈ ముగ్గురి కి నివాళిగా ఫిలిం క్రిటిక్స్ ఏర్పాటై చేసిన ఆనాటి సభలో డాక్టర్ అక్కినేని నాగేశ్వర రావు గారు , డాక్టర్ దాసరి నారాయణ రావు గారు , దర్శకులు వీర మాచనేని మధుసూదన రావు గారు, రచయిత్రులు వాసిరెడ్డి సీతాదేవి, డాక్టర్ కెవి కృష్ణకుమారి , ఆంధ్ర భూమి వార పత్రిక సంపాదకులు సి . కనకాంబరం రాజు , నేను పాల్గొన్నాము.ఒకే వేదిక పై ముగ్గురు ప్రతిభావంతులను స్మరించుకున్నాము .
-భగీరథ