తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఆరుగురు సభ్యులు గురువారం ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. తెలంగాణ శాసనమండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి శాసనమండలికి ఎన్నికైన సభ్యుల్లో ఒకరి తర్వాత ఒకరిని తన ఛాంబర్లో ప్రమాణస్వీకారం చేయించనున్నారు.
ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, బండా ప్రకాశ్, వెంకట్రామిరెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్ రావు, పాడి కౌశిక్ రెడ్డి ఎన్నికయ్యారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల గెజిట్ నోటిఫికేషన్ విడుదలైన విషయం విదితమే. ఇటీవల కొత్తగా ఎన్నికైన ఆరుగురు ఎమ్మెల్సీలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ అయింది. దీంతో డిసెంబరు ఒకటో తేదీ నుంచి ఎమ్మెల్సీల పదవీకాలం ప్రారంభమైంది.