టాలీవుడ్ లో తాజాగా మరో నటుడు ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఆగస్టు 15న ‘ఫిదా’ ఫేమ్ రాజా చెంబోలు నిశ్చితార్థం కూడా జరిగింది. ఈయన ప్రముఖ సినీ గేయ రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి పెద్ద కుమారుడు. తనకు నిశ్చితార్థం జరిగినట్టు రాజా ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. “2020లో ది బెస్ట్ పార్ట్ ఇది. నా కొత్త ప్రయాణం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. మీ అందరి ప్రేమ, ప్రోత్సాహానికి కృతజ్ఞతలు” అని తన పోస్ట్లో రాజా పేర్కొన్నారు. అంతేకాదు ఎంగేజ్డ్ అని హ్యాష్ట్యాగ్ తోపాటు రింగ్ ఎమోజీ కూడా చేర్చారు. అయితే, తనకు కాబోయే భార్య పేరు, వివరాలను మాత్రం రాజా వెల్లడించలేదు. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రికి ఇద్దరు కుమారుల సంతానం. పెద్ద కుమారుడు రాజా నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. రెండో కుమారుడు యోగేశ్వర్ శర్మ సంగీత దర్శకుడిగా ప్రయత్నిస్తున్నారు. రాజా ఇప్పటికే చాలా సినిమాల్లో నటించారు. ‘ఎవడు’, ‘ఫిదా’, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’, ‘హ్యాపీ వెడ్డింగ్’, ‘అంతరిక్షం’, ‘మిస్టర్ మజ్ను’, ‘రణరంగం’, ‘చాణక్య’, ‘ఇద్దరి లోకం ఒకటే’ వంటి సినిమాల్లో రాజా నటించారు. తాజాగా ఆయన ‘భానుమతి & రామకృష్ణ’ సినిమాలో కనిపించారు. ఇక తెలుగు సినీ పరిశ్రమలో సైతం ఈ లాక్డౌన్ సమయంలో చాలా పెళ్లిళ్లు జరిగాయి. దిల్ రాజుతో టాలీవుడ్ సెలబ్రిటీల పెళ్లిళ్లు మొదలయ్యాయి. దిల్ రాజు రెండో వివాహం, ఆ తర్వాత నిఖిల్, నితిన్, రానా దగ్గుబాటి వివాహలు జరిగాయి. మూడు రోజుల క్రితం మెగా డాటర్ నిహారిక కొణిదెల నిశ్చితార్థం చైతన్య జొన్నలగడ్డతో జరిగింది.
previous post