గతవారమే నటుడు, పట్నాసాహిబ్ శతృఘ్న సిన్హా కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే. ఆయన సతీమణి పూనమ్ సిన్హా సమాజ్వాదీ పార్టీలో చేరారు. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ను కలిసిన పూనమ్ ఆమె సమక్షంలో పార్టీలో చేరారు. ఈ విషయాన్ని సమాజ్వాదీ పార్టీ ట్విటర్ ద్వారా వెల్లడించింది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో లఖ్నవూ నుంచి ఎస్సీ-బీఎస్పీ-ఆర్ఎల్డీ కూటమి అభ్యర్థిగా పూనమ్ సిన్హాను బరిలోకి దించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ స్థానంలో భాజపా నుంచి కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ పోటీ చేస్తున్నారు. ఇందుకోసం ఆయన నేడు నామినేషన్ దాఖలు చేశారు.
రాజ్నాథ్కు పోటీగా బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తున్న మహాకూటమి నేతలు.. పూనమ్ సిన్హా వైపు మొగ్గుచూపుతున్నారు. లఖ్నవూ నుంచి పూనమ్ పేరు దాదాపు ఖరారైనట్లే అని తెలుస్తోంది. రేపు లేదా ఎల్లుండి ఆమె నామినేషన్ వేయనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. మరోవైపు శతృఘ్న సిన్హా కాంగ్రెస్లో చేరడంతో ఆ పార్టీ కూడా పూనమ్ సిన్హాకే మద్దతిచ్చే అవకాశాలున్నాయి. లఖ్నవూలో అభ్యర్థిని నిలబెట్టకుండా పూనమ్కు వెలుపలి నుంచి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇదే జరిగితే రాజ్నాథ్, పూనమ్ మధ్యే ప్రధానంగా పోటీ నెలకొననుంది. లఖ్నవూలో మే 6న ఎన్నికలు జరగనున్నాయి.