telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రభాస్ కోసం దిగ్గజ దర్శకుడిని రంగంలోకి దించిన నాగ్ అశ్విన్

Singeetham

‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సి.అశ్వినీదత్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా నటించనున్నారు. ఈ భారీ చిత్రం కోసం దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు సేవలు అందిస్తున్నారు. క్వారంటైన్ పీరియడ్‌లో గత కొద్ది నెలలుగా ఈ సినిమా కోసం సింగీతం పనిచేస్తున్నారు. తమ సినిమాకు సింగీతం శ్రీనివాసరావు మెంటర్‌గా పనిచేస్తున్నట్టు వైజయంతీ మూవీస్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ‘‘ఎంతో కాలంగా ఎదురుచూస్తోన్న కల మొత్తానికి నెరవేరింది. మా మహాకావ్యంలో సింగీతం శ్రీనివాసరావు గారిని స్వాగతించడాన్ని ఎంతో ఆనందిస్తున్నాం. ఆయన క్రియేటివ్ సలహాలు కచ్చితంగా మాకు ఎంతో ఉపకరిస్తాయి’’ అని వైజయంతీ మూవీస్ పేర్కొంది. కాగా ఈ చిత్రం సైన్స్-ఫిక్షన్ జానర్‌లో తెరకెక్కబోతోంది. అంతేకాదు, ప్రస్తుతం ఇండస్ట్రీలో సిద్ధమవుతోన్న అత్యంత భారీ చిత్రాల్లో ఇదీ ఒకటి. కాగా దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ‘ఆదిత్య 369’ సినిమా ద్వారా ఒక కొత్త ప్రపంచాన్ని తెలుగు ప్రేక్షకులకు చూపించారు. ఆ తరువాత ‘పుష్పక విమానం’, ‘మయూరి’, ‘భైరవద్వీపం’ ఇలాంటి ఎన్నో గొప్ప, ప్రయోగాత్మక సినిమాలను వెండితెరపై ఆవిష్కరించిన సింగీతం ఇప్పుడు ప్రభాస్ సినిమాకు మెంటర్‌గా పని చేయడం విశేషం.

Related posts