ఇటీవల ముగిసిన చైనా ఓపెన్లో భారత టాప్ షట్లర్లు పివి సింధు, సైనా నెహ్వాల్లకు మరోసారి కనీసం క్వార్టర్ఫైనల్కు చేరలేకపోయారు. తాజాగా కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-500 టోర్నీలో తొలి రౌండ్లోనే అనూహ్య పరాజయాలను చవిచూశారు. తొలిరౌండ్ పోటీలో సింధు చైనా సంతతికి చెందిన అమెరికా క్రీడాకారిణి బీవెన్ జాంగ్ చేతిలో 7-21, 24-22, 21-15 తేడాతో ఓడిపోయి ఇంటిబాట పట్టింది.
ఇటీవలే జరిగిన ప్రపంచ చాంపియన్లో బీవెన్ జాంగ్పై సునాయసంగా గెలిచిన సింధు నేటి మ్యాచ్లో మాత్రం పోరాడి ఓడింది. తొలిసెట్ను సునాయాసంగా గెల్చుకున్న సింధు రెండోసెట్లో బీవెన్ నుంచి అనూహ్య ప్రతిఘటన ఎదుర్కొంది. పోటాపోటీగా సాగిన ఈ సెట్ను చేతులారా చేజార్చుకోవడంతో సింధు ఒత్తిడికి గురైంది. నిర్ణయాత్మక మూడోసెట్లోనూ కొంత ప్రతిఘటించినా జంగ్ముందు నిలువలేకపోయింది. ఇక 8వ సీడ్ సైనా నెహ్వాల్ 21-19, 18-21, 1-8తో కిమ్-జి-యున్(కొరియా) చేతిలో పరాజయం పాలైంది. ఇరువురు షట్లర్లు ఒక్కోసెట్ గెల్చుకున్న తర్వాత మూడోసెట్లో సైనా గాయపడింది. 8-1 పాయింట్ల ఆధిక్యతలో కిమ్ ఉన్న దశలో గాయం తీవ్రత ఎక్కువ కావడంతో సైనా మ్యాచ్ మధ్యలోనే అర్ధాంతరంగా వైదొలగాల్సి వచ్చింది.
పురుషుల సింగిల్స్లో పారుపల్లి కశ్యప్ రెండోరౌండ్లోకి ప్రవేశించాడు. తొలిరౌండ్ పోరులో కశ్యప్ 21-16, 21-16 పాయింట్ల తేడాతో లూ-ఛియా-హంగ్(చైనీస్ తైపీ)పై సునాయాసంగా గెలుపొందాడు. మరో పోటీలో ప్రపంచ చాంపియన్షిప్ కాంస్య పతక విజేత సాయిప్రణీత్ తొలిరౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. డెన్మార్క్కు చెందిన 5వ సీడ్ ఆంటోన్సెన్ చేతిలో 21-9, 11-7తో ఓడాడు. తొలి సెట్ను కోల్పోయిన ప్రణీత్.. రెండో సెట్లో గాయపడ్డాడు. దీంతో రిటైర్డ్హర్ట్గా వెనుదిరిగాడు. దీంతొ కొరియా ఓపెన్లో సింధు, సాయి ప్రణీత్ల ప్రయాణం ముగిసింది. ఇక పురుషుల డబుల్స్లో మను అత్రి-సుమిత్రెడ్డి జోడీ 16-21, 21-19, 18-21తో చైనా జోడీ చేతిలో ఓటమిపాలయ్యారు. మరో డబుల్స్ జోడీ రంకిరెడ్డి-చిరాగ్శెట్టి జోడీ 19-21, 21-18, 18-21తో కొరియా జోడీ చేతిలో ఓడారు.