భారత ఓపెనర్ శిఖర్ ధావన్ అంతర్జాతీయ కెరియర్ నేటితో 10 సంవత్సరాలు పూర్తిచేసుకుంది. అక్టోబర్ 20న భారత వన్డే జట్టులో శిఖర్ ధావన్ అరంగేట్రం చేశాడు. తర్వాత తన దూకుడైన మార్క్ బ్యాటింగ్తో జట్టులో ఓపెనర్గా స్థిరపడ్డాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ 136 వన్డేల్లో 45 సగటుతో 5,688 పరుగులు చేశాడు. 2011లో టీ20, 2013లో టెస్టు జట్టులో చోటు సంపాదించాడు. 34 టెస్టులాడిన ధావన్ 40 సగటుతో 2,315 పరుగులు చేశాడు. 61 టీ20 మ్యాచ్లాడి 1,588 పరుగులు చేశాడు. ఐసీసీ టోర్నీలు అనగానే ధావన్ రెచ్చిపోయి బ్యాటింగ్ చేస్తాడు. ఇప్పటి వరకు ప్రపంచస్థాయి టోర్నీల్లో 18 మ్యాచులాడిన గబ్బర్ 65.47 సగటుతో 1,113 పరుగులు చేశాడు. అందులో 5 శతకాలు, 4 అర్ధశతకాలున్నాయి. ఇక 2008లో ఐపీఎల్ లో ఢిల్లీ తరపున ఆడిన గబ్బర్ ముంబై, ఆ తర్వాత హైదరాబాద్ కు ప్రాతినిధ్యం వహించి ఇప్పుడు మళ్ళీ ఢిల్లీ తరపున ఆడుతున్నాడు. మొత్తం 169 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడిన ధావన్.. 35 సగటు, 126 స్ట్రైక్రేట్తో 5,044 పరుగులు చేశాడు. ఈ సీజన్లో ఇప్పటికే రెండు వరుస సెంచరీలు బాదేసి రికార్డు సృష్టించాడు. ఈ సందర్భంగా గబ్బర్ ట్విటర్ వేదికగా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ‘టీమ్ ఇండియాతో పదేళ్లు. నా దేశం కోసం ఆడుతున్నాను. ఇంతకంటే గొప్ప గౌరవం ఇంకేం ఉండదు. నా మాతృభూమికి ప్రాతినిధ్యం వహించడం నా జీవితానికి సరిపోయే జ్ఞాపకాలను ఇచ్చింది. సదా నేను కృతజ్ఞుడిని’ అని ధావన్ ట్వీట్ చేశాడు.
previous post
చంద్రబాబు మౌనీ బాబా అయ్యారు: : విజయసాయి