వైసీపీ అధినేత జగన్ సోదరి షర్మిళ పార్టీ తరపున ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఆమె నేడు ప్రచారంలో భాగంగా వివిధ సభలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నిజం చెప్పకూడదన్న శాపం చంద్రబాబుకు ఉందని, ఒకవేళ నిజం చెబితే ఆయన తలకాయ వెయ్యి ముక్కలు అయిపోతుందని, అందుకే, బాబు అన్నీ అబద్ధాలు చెబుతున్నారంటూ వైసీపీ నేత షర్మిళ సెటైర్లు విసిరారు. ఇచ్చిన ఏ ఒక్క హామీనీ చంద్రబాబు నెరవేర్చలేదని విమర్శించారు. సొంతమామకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు, ఈ ఐదేళ్లలో హామీలు ఎగ్గొట్టి ప్రజలకు కూడా ఎన్నో వెన్నుపోట్లు పొడిచారని, 600 హామీలిచ్చిన చంద్రబాబు, వాటిని ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు.
ఎన్నికల ముందు నిరుద్యోగ భృతి, పసుపు-కుంకుమ వంటి పథకాలను, చిన్నపిల్లలకు చాక్లెట్లు ఇచ్చినట్టు, కుక్క పిల్లలకు బిస్కెట్లు వేసినట్టుగా బాబు తీసుకొచ్చారని, షర్మిళ విమర్శించారు. ఆడపిల్ల పుట్టిన ఇంటికి రూ.25 వేలు, కాలేజీ విద్యార్థులకు ఐప్యాడ్, మహిళలకు స్మార్ట్ ఫోన్లు, ఇంటికో ఉద్యోగం ఇస్తానంటూ పలు హామీలిచ్చిన చంద్రబాబును అవన్నీ ఎందుకు నెరవేర్చలేదని, ఆఖరి ఆరు నెలలలో ఈ కొత్తపడకలు ఎలా సాధ్యపడ్డాయని నిలదీయాలని, బాకీపడ్డ వన్నీ తీర్చమని అడగడం ప్రజల హక్కు అని ప్రజలకు సూచించారు.