టీమిండియా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ .. బౌలింగ్ చేయలేకపోవడం వల్లే బెస్ట్ ఆల్రౌండర్ అయిన హార్దిక్ పాండ్యాను పక్కన పెట్టామని స్పష్టం చేశాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయలేకపోతున్నాడని, దాంతో ప్రత్యామ్నాయ ఆల్రౌండర్పై దృష్టిసారించమన్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో శార్దూల్ ఠాకుర్ సత్తా చాటడంతో అతనికి అవకాశం దక్కిందన్నాడు. తాజాగా పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో భరత్ అరుణ్.. ఇంగ్లండ్ పర్యటనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘హార్దిక్ పాండ్యాకు మించిన ఆటగాడిని వెతికి పట్టుకోవడం చాలా కష్టం. అతనిలో అసాధారణమైన ప్రతిభ ఉంది. కానీ దురదృష్టవశాత్తు వెన్నుముక శస్త్రచికిత్స వల్ల బౌలింగ్ చేయలేకపోతున్నాడు. 2018లో అతను చివరిసారిగా ఇంగ్లండ్పై ఆడిన టెస్టు క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఏదేమైనప్పటికీ అతనిపై ఒత్తిడి తగ్గించి తిరిగి కోలుకునేలా చేయాలి. అతనికి ప్రత్యామ్నయంగా ఆల్రౌండర్లను సెలక్టర్లు గుర్తించడం పెద్దపని. ఆ తర్వాత వారిని మేం మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతాం. శార్దూల్ విషయానికొస్తే అతడు మంచి ఆల్రౌండర్ అని నిరూపించుకున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుత ప్రదర్శన చేశాడు. బౌలింగ్ ఆల్రౌండర్గా ఎదగాలని పట్టుదలతో ఉన్నట్లు అంతకుముందు చెప్పాడు. జట్టుకు కూడా ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ ఎంతో అవసరం. కాబట్టి అతడిని ఆ విధంగా తీర్చుదిద్దుతాం అన్నారు.
previous post
జీఎన్ రావు కమిటీ నివేదికపై కేబినెట్ లో చర్చ జరగాలి: పురంధేశ్వరి