ఓటర్లను తక్కువగా అంచనా వేయొద్దని బీజేపీకి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ హితవు పలికారు. శివసేన అధికార పత్రిక ‘సామ్నా’ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందిరాగాంధీ, అటల్ బిహారీ వాజ్ పేయి వంటి మహామహులకే ఓటర్లు చుక్కలు చూపించారని అన్నారు. ఎన్నికల్లో ఓడించారని గుర్తు చేశారు.
నేను మళ్లీ వస్తా అంటూ మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఎన్నికల సమయంలో ఓవర్ కాన్ఫిడెన్స్ ను ప్రదర్శించారని అన్నారు. దీంతో ఆయన అహంకారం మహారాష్ట్ర ప్రజలకు అర్థమయిందని అన్నారు. బీజేపీని అధికారానికి దూరం చేశారని చెప్పారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో విభేదాలు తలెత్తాయంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని పవార్ చెప్పారు.
ప్రజాస్వామ్య దేశంలో ఎప్పటికీ మేమే అధికారంలో ఉంటామనే భావనలో ఉండరాదని పవార్ చెప్పారు. ఇలాంటి భావజాలాన్ని ఓటర్లు అంగీకరించరని అన్నారు. ఎంతో మంది పవర్ ఫుల్ లీడర్లు కూడా ఓడిపోయారని చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ ఓడిపోవడానికి ఇదే కారణమని అన్నారు. రాజకీయ నాయకుడి కంటే సామాన్యుడు తెలివైనవాడని చెప్పారు. అందుకే ‘మళ్లీ మేమే అధికారంలోకి వస్తాం’ అంటూ విర్రవీగేవారిని ప్రజలు ఇంటికి పంపిస్తారని అన్నారు.