ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల లడఖ్లో పర్యటించి సర్ప్రైజ్ ఇచ్చారంటూ వస్తోన్న ప్రచారంపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పందించారు. ఇందులో సర్ప్రైజ్ ఏముందని అన్నారు. గతంలో నెహ్రూ కూడా ఇలాగే పర్యటించారని గుర్తుచేశారు.
1962లో చైనాతో యుద్ధం జరిగిన సమయంలోనూ ఆ ప్రాంతంలో అప్పటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ పర్యటించారని అన్నారు. 1962లో చైనా చేతిలో భారత్ ఓడిపోయిందని అయినప్పటికీ వారిద్దరి పర్యటన భారత సైనికుల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంచిందని శరద్ పవార్ చెప్పారు.
దేశానికి నాయకత్వం వహిస్తోన్న వారు సైనికులను కలవడంలో సర్ప్రైజ్ ఏముంటుందని అన్నారు. తాను 1993లో రక్షణ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో చైనాలో పర్యటించానని తెలిపారు. సరిహద్దుల వద్ద ఆయుధాలు వాడొద్దంటూ ఇరు దేశాలు ఒప్పందంపై సంతకాలు చేశాయని శరద్ పవార్ చెప్పారు. అప్పట్లోనూ ప్రతిష్టంభన నెలకొనగా ఒప్పందం అనంతరం ఇరు దేశాల సైన్యం అక్కడి నుంచి వెనక్కి వెళ్లాయని తెలిపారు.