బాలీవుడ్ అగ్ర హీరో షారుక్ఖాన్.. ముంబై క్రూజ్ నౌక డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన తన కుమారుడు ఆర్యన్ఖాన్ను కలిసేందుకు తొలిసారి జైలుకు వెళ్లారు. ముంబయిలోని ఆర్థర్ రోడ్ జైల్లో ఉన్న కొడుకు కోసం ఆర్దర్ రోడ్ జైలుకెళ్లి, అక్కడ ఆర్యన్ తో కొద్దిసేపు మాట్లాడి తిరిగి వెళ్లిపోయారు. ఈ కేసులో ఇప్పటికే ఆర్యన్ బెయిల్ పిటిషన్ను మూడుసార్లు తిరస్కరించింది కోర్టు.
అక్టోబర్ 3న గోవాకు చెందిన క్రూజ్ నౌకలో ఎన్సీబీ అధికారులు జరిపిన దాడుల్లో ఆర్యన్ ఖాన్, మూన్మూన్ ధామేచ, అర్బాజ్ మెర్చంట్ సహా ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. ఈ దాడిలో పోలీసులు నిషేధిత డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. వీరిని కొన్నిరోజుల క్రితం కోర్టులో హాజరు పరచగా.. తదుపరి దర్యాప్తు నిమిత్తం ఎన్సీబీకి అప్పగించింది.
ఆ కస్టడీ ముగియడం వల్ల మరోసారి నిందితులను అధికారులు కోర్టులో హాజరుపరచగా.. ఆర్యన్ సహా ఎనిమిది మందికి న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అప్పటినుంచి వారందరూ జైలులో ఉన్నారు. అరెస్ట్ అయినప్పటి నుంచి ఆర్యన్ పలుమార్లు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా.. ఈ కేసు విచారిస్తోన్న ప్రత్యేక న్యాయస్థానం మాత్రం ఆర్యన్ అభ్యర్థనను తోసిపుచ్చుతూ వస్తోంది.