సీనియర్ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ తుదిశ్వాస విడిచారు. చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున 4 గంటలకు కన్నుమూశారు. ఆయన పూర్తిపేరు కొసనా ఈశ్వరరావు. వయసు 84 సంవత్సరాలు ..పబ్లిసిటీ డిజైనర్గా కెరీర్ ప్రారంభించిన ఆయన పలు చిత్రాలకు పోస్టర్లు తయారు చేసి.. అందరి మన్ననలు అందుకున్నారు. .పబ్లిసిటీ డిజైనర్గా కెరీర్ ప్రారంభించిన ఆయన 2600 పైగా సినిమాలకు పబ్లిసిటీ డిజైన్స్ అందించారు.
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించిన ఈశ్వర్కు చిన్నతనం నుంచి బొమ్మలు గీయడమంటే ఎంతో ఆసక్తి. ఈ క్రమంలోనే వంశపారంపర్యంగా వస్తున్న బొమ్మలు గీసే వృత్తిలోకి అడుగుపెట్టారు. స్వాతంత్ర్య వేడుకల్లో గాంధీ బొమ్మ వేసి చిన్నతనంలోనే అందరి మన్ననలు పొందారు. బొమ్మలు గీయాలనే ఆసక్తితో కాకినాడ పాలిటెక్నిక్ కళాశాలలో చదువును మధ్యలోనే ఆపేసి.. స్నేహితుడి సాయంతో మద్రాస్కు వెళ్లి పబ్లిసిటీ ఆర్టిస్టుగా స్థిరపడాలని నిర్ణయించుకున్నారు.
ఆర్టిస్ట్ కేతా వద్ద పోస్టర్ డిజైనింగ్లో మెళకువలు నేర్చుకుని ‘ఈశ్వర్’ పేరుతో సొంత పబ్లిసిటీ కంపెనీకి శ్రీకారం చుట్టారు. బాపు దర్శకత్వం వహించిన సాక్షి సినిమాతో పబ్లిసిటీ డిజైనర్గా ప్రయాణం ప్రారంభించారు. ‘సాక్షి’ సినిమా కలర్ పోస్టర్లు, లోగోను ఆయనే రూపొందించారు. బ్రష్ వాడకుండా నైఫ్ వర్క్తో ‘పాప కోసం’ చిత్ర పోస్టర్ల రూపకల్పన. .ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు. సుమారు 40 ఏళ్ల పాటు నిర్విరామంగా సేవలందించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 2వేల 6వందలకు పైగా చిత్రాలకు ఈశ్వర్ అదే గుర్తింపు పొందారు.
విజయా, ఏవీయం, జెమినీ, అన్నపూర్ణ, గీతా ఆర్ట్స్, సురేష్ ప్రొడక్షన్స్, వైజయంతి తదితర అగ్ర నిర్మాణ సంస్థలకు ఆయన పబ్లిసిటీ డిజైనర్గా వర్క్ చేశారు. పలు ప్రముఖ నిర్మాణ సంస్థల లోగోలను ఆయన డిజైన్ చేశారు. ‘దేవుళ్ళు’ ఆయన పని చేసిన ఆఖరి చిత్రం. ఈశ్వర్ రాసిన ‘సినిమా పోస్టర్’ పుస్తకానికి ఉత్తమ సినిమా గ్రంథ రచన విభాగంలో 2011లో నంది పురస్కారం లభించింది. చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గాను 2015లో ఈశ్వర్ను రఘుపతి వెంకయ్య పురస్కారంతో ఏపీ ప్రభుత్వం సత్కరించింది. ఈశ్వర్ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.