12వ శతాబ్దం నుంచి ఇప్పటి వరకు మనదేశంలో జరిగిన పరిణామ క్రమాన్ని భారతమెరికా పుస్తకంలో భగీరథ అద్భుతంగా రచించారు. నిజంగా ఇది భగీరథ ప్రయత్నమే అని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి. రమణాచారి పేర్కొన్నారు.
భగీరథ రచించిన “భారతమెరికా” పుస్తకాన్నిశనివారం రోజు 7వ ప్రపంచ తెలుగు సదస్సులో రమణాచారి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమణాచారి మాట్లాడుతూ “ఈరోజుకు ఎంతో ప్రత్యేకత వుంది. మళ్ళీ ఈనాటి రోజును మనం చూడలేము. ఈ రోజున ఈ పుస్తకం ఆవిష్కరించడం భగీరథ అదృష్టం. భగీరథ నాకు 30 సంవత్సరాలుగా తెలుసు. స్నేహశీలి, సహనశీలి అయిన భగీరథ చేసే ఏ ప్రయత్నమైనా విజయవంతం అవుతుంది. సాహిత్యం, చరిత్ర అంటే భగీరధకు ఎంత ఇష్టమో ఈ పుస్తకం చదివితే అర్ధమవుతుంది. 40 ఏళ్ళక్రితం భగీరధ రాసిన మానవత పుస్తకానికి మహాకవి శ్రీశ్రీ ముందు మాట వ్రాసి ఆశీర్వదించారు. అదే భాగీరధ సాహిత్య జీవితానికి పునాది వేసి స్ఫూర్తిని కలిగించింది” అని రమణాచారి చెప్పారు. భగీరథ రచించిన “అక్షరాంజలి” పుస్తకాన్ని నాకు అంకితం ఇచ్చాడు. ఆ స్మృతులు నాకు గుర్తున్నాయి అని రమణాచారి చెప్పారు.
ప్రత్యేక అతిధిగా వచ్చిన దర్శకుడు ఎస్.వి కృషారెడ్డి మాట్లాడుతూ “భారతమెరికా ఓ అద్భుతమైన ప్రయత్నం. ఈ పుస్తకం చదివిన తరువాత భగీరథ గారిలో ఇంత జ్ఞాన సంపద ఉందా ? అని ఆశర్యపోయాను. 12వ శతాబ్దము నుంచి మన చరిత్రను కళ్ళకు కట్టినట్టు చూపించారు” అని చెప్పారు. భారతమెరికా చదవడం మొదలు పెడితే ఎక్కడా ఆపాలనిపించదు. చక్కటి భాష, ఆసక్తి కలిగించే శైలి అమోఘంగా వుంది. నాకు మనస్ఫూర్తిగా నచ్చిన పుస్తకం “భారతమెరికా” అని చెప్పారు కృష్ణారెడ్డి.
నిర్మాత అచ్చి రెడ్డి మాట్లాడుతూ “భగీరధ గారు మాకు 30 సంవత్సరాలుగా తెలుసు. మా ఇద్దరికీ ఎంతో ఆత్మీయుడు. “భారతమెరికా” టైటిల్ చాలా ఆసక్తిని కలిగిస్తుంది. మధ్య యుగాలనాటి మన చరిత్రను తన అమెరికా పర్యటనతో కలిపి రాయడం నన్ను ఎంతో ఆకట్టుకుంది” అని చెప్పారు. ప్రతి ప్రవాస భారతీయుడు చదవాల్సిన అపురూప గ్రంధం “భారతమెరికా” అని అచ్చి రెడ్డి చెప్పారు.
రచయిత భగీరథ మాట్లాడుతూ సాంస్కృతిక వారసత్వం అన్నది ఒక తరం నుంచి మరో తరానికి అందించాలని, అలా జరగకపోతే జాతి నిర్వీర్యమై పోతుందనే సందేశం ఇచ్చే పుస్తకమే “భారతమెరికా” అని అన్నారు. “భారతమెరికా” గ్రంధాన్ని డాక్టర్ వంగూరి చిట్టెన్ రాజుకు అంకితం ఇచ్చారు.