అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన హింసాత్మక ఘటనల వెనుక సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావు హస్తం ఉందని పోలీసులు తేల్చారు. ఈయన స్వస్థలం ఏపీలో నరసరావుపేట. ఖమ్మంలో అతడిని అదుపులోకి తీసుకొని నరసరావుపేటకు తరలించారు.
అగ్నిపథ్ పథకం వల్ల ఆర్మీ అభ్యర్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని.. దీనిని అంగీకరిస్తే మీ భవిష్యత్తు అంధకారం అవుతుందని రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఆవుల సుబ్బారావుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 10 డిఫెన్స్ కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. అల్లర్లకు ఎలా పాల్పడాలన్న దానిపై యాక్షన్ ప్లాన్ను సుబ్బారావే అందించినట్లు పోలీసులకు సమాచారం అందించింది.
హకీంపేట ఆర్మీ సోల్జర్స్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బ్లాక్స్, 17/6 గ్రూప్తో పాటు పలు పేర్లతో వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేశారని.. అందులో సికింద్రాబాద్లో రైళ్లను ఎలా తగులబెట్టాలన్న దానిపై సభ్యులు చర్చించుకున్నారు. పెట్రోల్ బాటిళ్లు తీసుకొచ్చి.. రైళ్లను తగలబెడదామని కొందరు ఆందోళనకారులు మాట్లాడుకున్నారు. దానికి సంబంధించిన ఆడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సికింద్రాబాద్ అల్లర్ల కేసులో పోలీసులు ఇప్పటివరకు 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా ఈ ఘటనకు సంబంధించి 12 మంది యువకులు ప్రధాన కారకులుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
కాగా, పలువురు అభ్యర్థులతో సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సబ్బారావు దిగిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. దీంతో సుబ్బారావును ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్కు చెందిన స్టార్ డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడు వసీంపైనా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ప్రశ్నించే గొంతుంటేనే పేద ప్రజలకు న్యాయం: ఎంపీ కోమటిరెడ్డి