దేశంలో మరో ప్రైవేటు రైలు అందుబాటులోకి రానుంది. త్వరలోనే రెండో తేజస్ రైలు పట్టాలెక్కనుంది. జనవరి 17న అహ్మదాబాద్-ముంబయి మధ్య ఈ రైలును ప్రారంభించనున్నట్లు రైల్వే వర్గాలు వెల్లడించాయి. జనవరి 19 నుంచి రైలు కమర్షియల్ రన్ మొదలవనుంది. గురువారం మినహా వారంలో మిగతా ఆరు రోజులు ఈ రైలు నడవనుంది.
ప్రస్తుతం దిల్లీ-లఖ్నవూ మధ్య తేజస్ రైలు నడుస్తోన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది అక్టోబరు 4న మొట్టమొదటి ప్రైవేటు రైలును ప్రారంభించారు. తొలిసారిగా భారత రైల్వే శాఖ కాకుండా, దాని అనుబంధ సంస్థ అయిన ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో ఈ రైలు నడుస్తోంది. అధునాతన సౌకర్యాలు, హంగులతో ఈ రైలును తీసుకొచ్చారు. అంతేగాక, రైలు ఆలస్యమైతే ప్రయాణికులకు పరిహారం కూడా చెల్లించనుంది.