telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఏపీలో రేపటి నుండి స్కూల్స్‌ రీ ఓపెన్‌

ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ తరుణంలో విద్యార్థుల ఆరోగ్య సంరక్షణకు తొలి ప్రాధాన్యం ఇచ్చేలా ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంది. కోవిడ్‌ ప్రొటోకాల్‌ ప్రకారం స్కూళ్ల వారీగా స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ రూపొందించి అమలు చేస్తోంది. సోమవారం నుంచి అన్ని తరగతులు ప్రారంభం కానున్నాయి. కోవిడ్‌ నేపథ్యంలో ఇప్పటికే టీచర్లకు వ్యాక్సినేషన్‌ దాదాపు పూర్తి చేశారు. కోవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టినందున ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదు. అయినప్పటికీ పిల్లల ఆరోగ్య భద్రత ముఖ్యమైన అంశం కాబట్టి, ప్రభుత్వం దానిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించేలా తరగతి గదికి 20 మంది ఉండేలా చర్యలు తీసుకోనున్నారు.

6, 7, 8 తరగతులకు ఒక రోజు, 9, 10 తరగతులకు మరుసటి రోజు తరగతులు నిర్వహిస్తారు. ప్రాథమికంగా 1, 2, 3 తరగతులకు ఒక రోజు, 4, 5 తరగతులకు మరుసటి రోజు తరగతులు ఏర్పాటు చేస్తారు. తల్లిదండ్రుల రాతపూర్వక అనుమతితో విద్యార్థులు స్కూళ్లకు రావాల్సి ఉంటుంది. పాఠశాల తరగతి గదుల్లోనే కాకుండా ఆవరణలో, బయట పరిసర ప్రాంతాల్లో కూడా పూర్తిగా శానిటైజ్‌ చేయిస్తున్నారు. పిల్లల్లో ఎవరికైనా కోవిడ్‌ లక్షణాలు కనిపిస్తే వారిని వేరుగా ఉంచేందుకు ఐసోలేషన్‌ రూమ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఆ వెంటనే సమీపంలోని పీహెచ్‌సీ, ఆసుపత్రికి తెలియచేసి, వారికి వైద్యం అందేలా చూడాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి.

మార్గదర్శకాలు..

*10% కన్నా తక్కువ పాజిటివిటీ రేటు ఉన్న ప్రాంతాల్లోనే స్కూళ్లు తెరవాలని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసినందున వార్డు, గ్రామ సచివాలయ సిబ్బంది ప్రతి వారం కోవిడ్‌ కేసులను గుర్తిస్తుండాలి.
*బోధన, బోధనేతర సిబ్బంది ప్రతిరోజూ హాజరు కావాలి. రెగ్యులర్‌ సమయం ప్రకారమే తరగతులు కొనసాగాలి.
*అన్ని విద్యా సంస్థల్లో కోవిడ్‌ మార్గదర్శకాలను పాటించాలి.
*పోర్టబుల్‌ థర్మల్‌ స్కానర్‌తో ప్రవేశద్వారం వద్దే విద్యార్థులను పరిశీలించాలి. కోవిడ్‌ లక్షణాలు కనిపిస్తే ఇంటికి పంపి, పరీక్షలు చేయించుకోమని చెప్పాలి.
*శానిటైజర్‌ ఏర్పాటు చేసి, తరచూ చేతులు శుభ్రం చేసుకోమని చెప్పాలి. స్కూలు అసెంబ్లీ, గ్రూప్‌ వర్కులు, గేమ్స్‌ వంటివి నిర్వహించరాదు.
*తరగతి గదుల్లో 6 అడుగుల భౌతిక దూరం ఉండేలా సీటింగ్‌ ఏర్పాట్లు చేయాలి. టాయిలెట్ల వద్ద, భోజనాల సమయంలోనూ ఇది పాటించాలి. తరగతి గదులను ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేయాలి.
*ఇళ్లలో వృద్ధులైన తాత, అమ్మమ్మ, నాన్నమ్మలు ఉంటే పరిస్థితులు చక్కబడే వరకు ఇళ్ల వద్దనే ఉండాలి.
*రోగగ్రస్థులుగా ఉన్న విద్యార్థులను స్కూళ్లకు అనుమతించరాదు.
*మధ్యాహ్న భోజన పదార్థాలను వేర్వేరు సమయాల్లో వేర్వేరు తరగతుల విద్యార్థులకు పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేయాలి. పాఠశాల వదిలినప్పుడు గుంపుగా బయటకు పంపకూడదు.
*ప్రతి వారం ప్రతి స్కూలులో ఇద్దరు విద్యార్థులు, సిబ్బంది నుంచి ఒకరికి ర్యాండమ్‌ టెస్టులు చేయాలి. ఎవరికైనా పాజిటివ్‌ లక్షణాలుంటే అందరికీ పరీక్షలు చేయించాలి. *కోవిడ్‌పై తీసుకోవలసిన జాగ్రత్తలకు పీరియడ్‌ను కేటాయించాలి. స్కూలు నుంచి ఇంటికి వెళ్లిన వెంటనే ప్రతి విద్యార్థి స్నానం చేసేలా అవగాహన కల్పించాలి.
*పెన్నులు, పెన్సిళ్లు, ఎరేజర్‌లు, పుస్తకాలు, వాటర్‌ బాటిళ్లు, గ్లాసులు ఇచ్చిపుచ్చుకోవడం నిషేధం.
*టాయిలెట్లను రోజూ శుభ్రం చేయించాలి. స్కూలు బస్సుల్లేని పిల్లలను తల్లిదండ్రులే స్కూళ్ల వద్ద దింపాలి.
*ప్రతి స్కూలులో కోవిడ్‌ జాగ్రత్తల అమలుకు టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయాలి. మిగిలిపోయిన టీచర్లందరికీ వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలి.

Related posts