గాంధీ భవన్ లో టీపీసీపీ నేతలను దూషించిన కారణంగా కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సర్వే సత్యనారాయణను ఆదివారం పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..ఏఐసీసీ సభ్యుడైన నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసే అధికారం వీరికి ఎవ్వరిచ్చారని మండిపడ్డారు. సస్పెండ్ కాపీని చూపించే దమ్ము పీసీసీ నేతలకు ఉందా అని ప్రశ్నించారు.
గూడూరు నారాయణ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డిలు గతంలో దిగ్విజయ్ సమక్షంలోనే కొట్టుకున్నారని అప్పుడు వారినెందుకు పార్టీ నుంచి తొలగించలేదని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికలపై ఎవరు సమీక్ష చెయ్యమన్నారని అడిగినందుకే నన్ను సస్పెండ్ చేశారని తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహించి రాజీనామా చెయ్యాల్సిందిపోయి ఇంకా పదవులను పట్టుకుని వేళాడుతున్నారని ఘాటుగా విమర్శించారు.