తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ ప్రచార చిత్రాన్ని ‘ఆచార్య’ సినిమా రిలీజ్ రోజున థియేటర్లలో విడుదల చేస్తారని సమాచారం.
ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి, రామ్చరణ్ కలిసి నటించిన ‘ఆచార్య’ సినిమాకు సూపర్స్టార్ మహేశ్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చారు. దీంతో అటు మెగాఫ్యాన్స్, ఇటు సూపర్స్టార్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోయారు.
ఇప్పుడు వీరి ఆనందాన్ని మరింత రెట్టింపు చేసేందుకు ఇరు చిత్ర యూనిట్స్ కలిసి మరో కొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మే 29 ‘ఆచార్య’ సినిమా రిలీజ్ రోజున థియేటర్లలో ‘సర్కారు వారి పాట’ ట్రైలర్ను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ఈ విషయమై వరుస కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ ఇదే కనుక నిజమైతే అభిమానులకు ఇక పండగే.
కాగా, ‘ఆచార్య’ విషయానికొస్తే.. దేవాలయాల ప్రాముఖ్యత, వాటిని అడ్డుపెట్టుకుని కొంతమంది చేసే అవినీతిని చూపించే కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకున్నట్లు తెలుస్తోంది.
కొరటాల శివ దర్శకత్వంలో చిరు, చరణ్, పూజాహెగ్డే ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక ‘సర్కారు వారి పాట’ విషయానికొస్తే.. బ్యాంకు కుంభకోణం నేపథ్యంలో దీన్ని రూపొందించారు.