“మహర్షి”తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సూపర్స్టార్ మహేష్ బాబు తాజాగా నటిస్తున్న 26వ చిత్రం “సరిలేరు నీకెవ్వరు”. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని అనీల్ సుంకర, దిల్రాజు, మహేష్ నిర్మిస్తున్నారు. సీనియర్ నటి విజయశాంతి కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కాశ్మీర్లో ప్రారంభమయ్యింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం జగపతిబాబు యూనిట్ సభ్యులు సంప్రదించారట. అంతా ఓకే అనుకున్న తర్వాత మహేశ్ సినిమా కాబట్టి.. తనకు వచ్చిన రెండు ఆఫర్స్ను కాదని, డేట్స్ కేటాయించారట. అయితే ఏం జరిగిందో ఏమో కానీ.. జగపతిబాబును పక్కన పెట్టేసి ఆయన స్థానంలో ప్రకాశ్ రాజ్ను తీసుకున్నారట. జగపతిబాబును పక్కన పెట్టడానికి సరైన కారణం కూడా చెప్పలేదట. మరి జగపతిబాబును అలా కారణం చెప్పకుండా పక్కన పెట్టేయడానికి గల కారణమేంటో తెలియలేదు. అనీల్ సుంకర, దిల్రాజుతో పాటు మహేశ్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
next post